AC Bus: 80 మంది ప్రయాణీకులతో ఉన్న ఏసీ బస్సు.. బ్యాటరీ పేలిపోయి సడన్గా ఎగసిపడిన మంటలు.. చివరకు..
ABN , First Publish Date - 2023-03-23T19:47:55+05:30 IST
బస్సు బయలుదేరబోతుండగా భారీ శబ్దం.. బస్స్టాండ్లో ఒక్కసారిగా రేగిన కలకలం.. అసలేం జరిగిందంటే..
ఇంటర్నెట్ డెస్క్: అది రాత్రి 9.15 గంటలు. బస్ స్టాండ్ అంతా బిజీగా ఉంది. రాయల్ రాని బాలాజీ ట్రావెల్స్కు చెందిన ఓ బస్సు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ప్రయాణికులందరూ ఎవరి సీట్లో వాళ్లు కూర్చున్నారు. ఇంతలో బస్సులో భారీ శబ్దం. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మెల్లగా అన్నివైపులకు వ్యాపించడం ప్రారంభించాయి. ఈ క్రమంలో బస్సులోంచి బయటపడేందుకు ప్రయత్నంలో ఉన్న ప్రయాణికుల మధ్య తొక్కిసలాట కూడా జరిగింది. అయితే.. అదృష్టవశాత్తూ మంటలు తీవ్రరూపం దాల్చే లోపే ప్రయాణికులందరూ సురక్షితంగా దిగిపోయారు. మధ్యప్రదేశ్లోని(Madhyapradesh) ఖార్గోన్(Khargone) జిల్లాలో బుధవారం జరిగిందీ ఘటన.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖండ్వా నుంచి సూరత్ వైపు వెళుతున్న బస్సులో ఈ ఘటన జరిగింది. బస్సులోని బ్యాటరీ ఒక్కసారిగా పేలిపోవడంతో(Battery explosion) ఈ ప్రమాదం(Bus catches fire) జరిగిందని ప్రత్యక్ష సాక్షులు అనుమానిస్తున్నారు. మంటల నుంచి బయటపడే క్రమంలో బస్సులోని ప్రయాణికుల మధ్య తొక్కిసలాట కూడా జరిగిందని చెప్పారు. అయితే.. అక్కడే ఉన్న ట్రావెన్స్ ఏజెన్సీ సిబ్బంది కొందరు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.
ఇంతలో అగ్నిమాపక సిబ్బందికి కూడా సమాచారం అందడంతో వారు కూడా ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. అయితే..బస్సుకు భారీ నష్టమేదీ వాటిల్లకపోవడంతో బస్సు యజమాని కొత్త బ్యాటరీని తెప్పించి బస్సులో అమర్చాడు. ఆ తరువాత ప్రయాణికులతో సహా బస్సు సూరత్ వైపు కదిలింది. ఈ ఘటన కారణంగా బస్స్టాండ్లో చాలాసేపు కలకలం కొనసాగింది.