హైటెన్షన్ విద్యుత్ వైర్లపై నడక.. గ్రామస్తుతులు వారిస్తున్నా వినకుండా ట్రాన్స్‌మిషన్ టవర్ ఎక్కి..

ABN , First Publish Date - 2023-03-25T21:41:48+05:30 IST

ఆ గ్రామంలో నెమ్మదిగా నిశ్శబ్దం ఆవరిస్తోంది. సూర్యాస్తమయం అయ్యింది. ఇంతలో ఓ వ్యక్తి పొలంలోని భారీ ట్రాన్స్‌మిషన్ టవర్‌ను ఎక్కడం మొదలెట్టాడు.

హైటెన్షన్ విద్యుత్ వైర్లపై నడక.. గ్రామస్తుతులు వారిస్తున్నా వినకుండా ట్రాన్స్‌మిషన్ టవర్ ఎక్కి..

ఇంటర్నెట్ డెస్క్: ఆ గ్రామంలో నెమ్మదిగా నిశ్శబ్దం ఆవరిస్తోంది. సూర్యాస్తమయం అయ్యింది. ఇంతలో ఓ వ్యక్తి పొలంలోని భారీ ట్రాన్స్‌మిషన్ టవర్‌ను ఎక్కడం మొదలెట్టాడు. అక్కడే ఉన్న గ్రామస్థులు కొందరు అతడిని చూసి హడలిపోయారు. కరెంట్ షాక్ తగులుతుందంటూ వారించే ప్రయత్నం చేశారు. కానీ అతడు మాత్రం వాళ్ల మాటను లెక్కచేయలేదు. ఆ తరువాత అతడు చేసిన పనికి గ్రామంలోని వారికి రాత్రంతా నిద్రేలేకుండా పోయింది. రాజస్థాన్‌లోని ఆజ్మీర్ జిల్లాలో శుక్రవారం ఈ ఘటన వెలుగు చూసింది.

భావ్తా గ్రామానికి చెందిన సన్వర్‌లాల్‌కు మతిస్థిమితం లేదు. ఈ క్రమంలోనే అతడు శుక్రవారం గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేపాడు. ఎందరు వారించినా వినకుండా ట్రాన్స్‌మిషన్ టవర్ ఎక్కేశాడు. అప్పటికే అప్రమత్తమైన గ్రామస్తులు అధికారులను అలర్ట్ చేయడంతో వారు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. కానీ.. ఆ తరువాతే అసలు హడావుడి మొదలైంది. ట్రాన్స్‌మిషన్ టవర్ పైదాకా వెళ్లిపోయిన సన్వర్‌లాల్ హైటెన్షన్ వైర్‌లపై నడవడం ప్రారంభించారు. కిందకు దిగకుండా తొమ్మిది గంటల పాటు వైర్లపై సర్కస్ ఫీట్లు చేశాడు. వైర్లపైనే అటూఇటూ నడుస్తూ, కాసేపు వాటిపైనే కూర్చుంటూ అధికారులకు, గ్రామస్తులకూ చుక్కలు చూపించాడు. ఈలోపు రాష్ట్ర విపత్తు నిర్వహణ సిబ్బంది రంగంలోకి దిగి అతడిని కష్టపడి కిందకు దింపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

కాగా.. సన్వర్‌లాల్ కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని అతడిని తమ వెంట తీసుకెళ్ళిపోయారు. అయితే.. రాత్రంతా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గ్రామస్తులు జాగారం చేయాల్సి వచ్చింది. ఈ ఉదంతం స్థానికంగా పెద్ద చర్చనీయాంశమైంది.

Updated Date - 2023-03-25T21:41:48+05:30 IST