Birbum: భర్త చనిపోయిన రెండేళ్లకు బిడ్డకు జన్మనిచ్చిన భార్య.. ఐవీఎఫ్ పద్ధతితో సాధ్యమేనంటున్న డాక్టర్లు
ABN , Publish Date - Dec 17 , 2023 | 12:38 PM
పశ్చిమ బెంగాల్(West Bengal)కి చెందిన ఓ మహిళ భర్త చనిపోయిన రెండేళ్లకు మగబిడ్డకు జన్మనిచ్చింది.
కోల్కతా: పశ్చిమ బెంగాల్(West Bengal)కి చెందిన ఓ మహిళ భర్త చనిపోయిన రెండేళ్లకు మగబిడ్డకు జన్మనిచ్చింది. అది కూడా ఐవీఎఫ్ పద్ధతిలో. వైద్య రంగంలో అరుదైన రికార్డని డాక్టర్లు చెబుతున్నారు. సంగీత అనే మహిళ ఉత్తర పరగణాల్లోని నైహతిలో తన తల్లిదండ్రులతో ఉండేది. ఆమెకు 27 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు మురారై కి చెందిన అరుణ్ ప్రసాద్(48)తో వివాహం జరిగింది.
వివాహం అయినప్పటి నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా వారికి సంతానం కలగలేదు. అదే టైంలో రెండేళ్ల క్రితం ఆమె భర్త కరోనాతో మరణించాడు. భర్త దూరమయ్యాడనే బాధతోపాటు సంతానం కలగలేదనే వేదన ఆమెకు తీరని శోకాన్ని మిగిల్చింది. భర్త చనిపోకముందే ఆయన వీర్యాన్ని(Sperm) కోల్ కతాలోని ఓ ల్యాబ్ లో భద్రపరిచారు. తల్లి కావాలనుకున్న ఆమె తన కోరికను డాక్టర్లకు చెప్పడంతో ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ టెక్నాలజీ ద్వారా రామ్ పూర్ హట్ మెడికల్ కాలేజీలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
అలా తన కలను నిజం చేసుకున్న ఆ తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఐవీఎఫ్(IVF) పద్ధతి ద్వారా బిడ్డకు జన్మనిచ్చిన మహిళగా రికార్డు సాధించింది. భర్త చనిపోయిననాటి నుంచి ఆమె అత్తమామలు, తల్లిదండ్రులతో కలిసి ఉండట్లేదు.