Nandikotkur Politics: మంత్రి రోజా వచ్చి వెళ్లడంతో ఎంత పనైందంటే..

ABN , First Publish Date - 2023-07-20T17:32:21+05:30 IST

నందికొట్కూరు నియోజకవర్గంలోని అధికార పార్టీలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయి. శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్దార్థరెడ్డి, ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్‌కు చెందిన రెండు వర్గాల నాయకులు బాహాటంగానే రోడ్డెక్కి ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే అధికారుల బదిలీల నుంచి మొదలైన అభిప్రాయభేదాలు చివరకు రెండు వర్గాలుగా విడిపోయేలా చేశాయి.

Nandikotkur Politics: మంత్రి రోజా వచ్చి వెళ్లడంతో ఎంత పనైందంటే..

నందికొట్కూరు: నందికొట్కూరు నియోజకవర్గంలోని అధికార పార్టీలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయి. శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్దార్థరెడ్డి, ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్‌కు చెందిన రెండు వర్గాల నాయకులు బాహాటంగానే రోడ్డెక్కి ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే అధికారుల బదిలీల నుంచి మొదలైన అభిప్రాయభేదాలు చివరకు రెండు వర్గాలుగా విడిపోయేలా చేశాయి. నియోజకవర్గంలో ఎవరి కార్యక్రమాలు వారు నిర్వహించుకుంటున్నారు. అయితే నియోజకవర్గ స్థాయి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి తనకు ప్రాధాన్యమివ్వడం లేదంటూ ఎమ్మెల్యే ఆర్థర్‌ గైర్హాజరవుతున్నారు. అవమానిస్తే ఎలా వస్తారంటూ ఎమ్మెల్యే వర్గం బాహాటంగానే ఆరోపిస్తోంది. ఇలా ఒకరిపై ఒకరు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు. అధిష్టానం పలుసార్లు శాంతి చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. ఇంత వరకు అంతర్గతంగా ఉన్న విభేదాలు సార్వత్రిక ఎన్నికలు సమీపించే కొద్దీ జఠిలమవుతున్నాయి.


స్థానిక సంస్థల ఎన్నికలతో మళ్లీ..

మున్సిపల్‌ ఎన్నికలు, సర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇరువర్గాల మధ్య అభిప్రాయబేధాలు బయటపడ్డాయి. అప్పటి జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ జోక్యం చేసుకుని సర్దిచెప్పినా ఎవ్వరూ తగ్గలేదు. కర్నూలులో ఓ ప్రైవేటు హోటల్‌లో ఒకరి వర్గంపై ఒకరు దాడులు చేసుకునే స్థాయికి వెళ్లారు. పార్టీ అభ్యర్థులకు ఎమ్మెల్యే బీఫారం ఇవ్వగా, సిద్దార్థరెడ్డి తన అనుచరులను స్వతంత్ర అభ్యర్థులుగా నిలబెట్టి గెలిపించి తన ప్రాధాన్యతను అధిష్టానానికి చూపించారు. దీంతో బైరెడ్డికి శాప్‌ చైర్మన్‌ పదవిని కట్టబెట్టారు. దీంతో ఆయన రాష్ట్రంలోని అన్ని జిల్లాలు తిరుగుతుండగా, నియోజకవర్గ పూర్తి బాధ్యతలను ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్‌కు సీఎం జగన్‌ అప్పగించారు. అప్పటి నుంచి అవకాశం దొరికిన ప్రతిచోట సిద్ధార్థరెడ్డి వర్గీయుల నుంచి ఎమ్మెల్యేకు నిలదీతలు, అడ్డంకులు ఎదురయ్యారు. పగిడ్యాల మండలంలో నెహ్రూనగర్‌లో ఏకంగా వాలెంటీర్లు గడపగడప కార్యక్రమానికి గైర్హాజరయ్యారు.

ప్రొటోకాల్‌ తెచ్చిన తంట

తాజాగా ఎమ్మెల్యే ఆర్థర్‌, శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్దార్థరెడ్డి మధ్య ప్రొటోకాల్‌ సమస్య విభేదాలను తీవ్రస్థాయికి తీసుకెళ్లింది. గతంలో మిడ్తూరు మండలం నాగలూటి గ్రామ సచివాలయ ప్రారంభోత్సవానికి అప్పటి జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌తో ప్రారంభించారు. అయితే ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్‌కు నాడు ఆహ్వానించలేదని దళిత సంఘాలు ప్రత్యక్షంగా ఆరోపించాయి. ఈ నెల 15వ తేదీన నందికొట్కూరు, పగిడ్యాలలోని ఇండోర్‌స్టేడియాలను మంత్రి రోజా ప్రారంభించారు. ఈ సమయంలో ప్రొటోకాల్‌ పాటించకుండా ఎమ్మెల్యేను అవమానించారని, మంత్రి రోజా ఎమ్మెల్యేకు క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్యే వర్గీయులు, దళిత సంఘాల నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసనకు ప్రతిస్పందనగా బైరెడ్డి సిద్దార్థరెడ్డి వర్గీయులు ప్రెస్‌మీట్‌ పెట్టి తన విజయానికి కృషి చేసిన దళితులను పక్కనపెట్టి నిజమైన దళిత ద్రోహిగా ఎమ్మెల్యే నిలిచారన్నారు. ఈ క్రమంలో రెండు వర్గాల దళిత నాయకులు ఎవరికి వారుగా విమర్శకు ప్రతివిమర్శ చేసుకుంటూ పోతున్నారు. అయితే అటు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్‌, ఇటు బైరెడ్డి సిద్దార్థరెడ్డిలో ఏ ఒక్కరూ ఇంత వరకు స్పందించకపోవడం గమనార్హం.

మొదట్నుంచీ కుడి ఎడమల వైఖరి

ఎస్సీ నియోజకవర్గంలో సిద్దార్థరెడ్డి పెత్తనం ఏమిటని ఎమ్మెల్యే వర్గం ప్రశ్నిస్తుంటే.. నియోజకవర్గంలో నిజమైన దళిత ద్రోహి ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్‌ అంటూ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వర్గం విమర్శ, ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. నంద్యాల జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఆరు స్థానాల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఎమ్మెల్యేలు కాగా, ఒకే ఒక దళిత ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్‌ ఉన్నారు. నందికొట్కూరు నియోజకవర్గం ఎస్సీకి రిజర్వుడు కావడంతో 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి 40 వేల భారీ మెజార్టీతో తోగూరు ఆర్థర్‌ విజయం సాధించారు. నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా మెజార్టీ సాధించి ఆయన చరిత్ర సృష్టించారు. ఈ ఆనందం పట్టుమని మూడు నెలలు కూడా నిలవలేదు. ఎమ్మెల్యే విజయంలో కీలకపాత్ర పోషించానని చెప్పుకుంటున్న నియోజకవర్గ సమన్వయకర్త బైరెడ్డి సిద్దార్థరెడ్డికి ఎమ్మెల్యేకు అభిప్రాయ భేదాలు తలెత్తాయి. అధికారంలో ఉన్నా బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై కేసులు నమోదు కావడంతో ఆయన నియోజకర్గానికి కొంతకాలం దూరంగా ఉండిపోయారు.

Updated Date - 2023-07-20T17:32:24+05:30 IST