Somu Veerraju: పవన్ కారణంగానే వీర్రాజుకు పదవి పోయిందా?

ABN , First Publish Date - 2023-07-04T23:14:12+05:30 IST

సోము వీర్రాజు వైఖరిపై బీజేపీ అధిష్టానం వద్ద పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం ఉంది. అంతేకాకుండా సీఎం రమేష్, సుజనా చౌదరి, సత్యకుమార్ లాంటి బీజేపీ నేతలు వీర్రాజుపై అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

Somu Veerraju: పవన్ కారణంగానే వీర్రాజుకు పదవి పోయిందా?

వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ నూతన మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో పార్టీ అధ్యక్షులను మార్చింది. ఏపీలో సోము వీర్రాజు స్థానంలో పురందేశ్వరికి అధ్యక్ష పదవిని కట్టబెట్టింది. ప్రతి మూడేళ్లకు అధ్యక్ష పదవులను మార్చే పద్ధతిలోనే ప్రస్తుత మార్పులు చేశామని బీజేపీ చెప్తున్నా.. సోము వీర్రాజుపై వ్యతిరేకత కారణంగానే అధ్యక్ష పదవిలో మార్పు చేసినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ముఖ్యంగా ఏపీలో బీజేపీ పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీతో పొత్తులో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే జనసేనతో సోము వీర్రాజు అంటీఅంటన్నట్లు ప్రవర్తించారు. ఆయన వైఖరి కారణంగా పవన్ కళ్యాణ్ కూడా దూరంగానే ఉంటూ వచ్చారు. అధికార పార్టీ వైసీపీ నేతలతో సోము వీర్రాజు సన్నిహితంగా ఉన్నట్లు ఊహాగానాలు వచ్చాయి. ఆయన ఆ పార్టీకి అనుకూలంగా మీడియాలో వ్యాఖ్యలు చేయడం పవన్‌కు నచ్చేవి కావు. దీంతో వీర్రాజు వైఖరిపై బీజేపీ అధిష్టానం వద్ద పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం ఉంది. అంతేకాకుండా సీఎం రమేష్, సుజనా చౌదరి, సత్యకుమార్ లాంటి బీజేపీ నేతలు వీర్రాజుపై అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. వీర్రాజుతో పాటు సునీల్ డియోధర్, జీవీఎల్ కూడా వైసీపీకి అసోసియేట్లుగా వ్యవహరించడం జనసేన పార్టీకి మింగుడు పడలేదు.

అటు గత ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిన బీజేపీ వచ్చే ఎన్నికల్లో పుంజుకోవాలంటే జనసేనతో పొత్తు గ్యారంటీగా పెట్టుకోవాల్సిన పరిస్థితి. దీంతో పవన్ ఆరోపణలను పరిగణనలోకి తీసుకున్న బీజేపీ అధిష్టానం సోము వీర్రాజుపై వేటు వేసినట్లు తెలుస్తోంది. అటు టీడీపీ- జనసేనతో పొత్తు పెట్టుకోవడానికి కూడా సోము వీర్రాజు ఆసక్తి చూపించలేదు. ఎప్పటికప్పుడు తాము టీడీపీతో కలిసేది లేదని చెప్తూ వచ్చారు. కానీ జనసేన నేతలు మాత్రం టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు ఇంట్రస్ట్‌గా ఉన్నారు. గతంలో జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్‌ను తమ పార్టీ నేత కన్నా లక్ష్మీనారాయణ కలవడాన్ని కూడా అధ్యక్షుడిగా సోము వీర్రాజు తప్పుబట్టారు. దీంతో కన్నా తిరుగుబాటు బావుటా ఎగురవేసి బీజేపీ నుంచి టీడీపీలోకి జంప్ అయ్యారు. అటు బీజేపీలో ఓ వర్గాన్ని సోము వీర్రాజు వ్యతిరేకిస్తూ వచ్చారు. సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటి నేతలతో దూరంగా ఉండేవారు. పార్టీ అధ్యక్షుడిగా అందరినీ కలుపుకుపోవాల్సిన వీర్రాజు ఓ వర్గానికి మాత్రమే అనుకూలంగా ఉండటం కూడా ప్రతికూల సంకేతాలను అధిష్టానానికి పంపింది. వీటిని పరిగణనలోకి తీసుకున్న బీజేపీ అధిష్టానం తాజాగా వీర్రాజును తప్పించి పురందేశ్వరికి బాధ్యతలను అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముందో బీజేపీ అధిష్టానానికే తెలియాలి.

Updated Date - 2023-07-04T23:14:12+05:30 IST