Share News

Telangana Elections : ‘వార్‌’సుల హోరు

ABN , First Publish Date - 2023-11-23T15:47:03+05:30 IST

ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుతోంది.

Telangana Elections : ‘వార్‌’సుల హోరు

  • తండ్రుల గెలుపునకు తనయుల ఆరాటం

  • ప్రచారకర్తలుగా అన్నీ తామైన వారసులు

  • ఉదయం నుంచి రాత్రి వరకు ప్రచారంలో నిమగ్నం

  • షెడ్యూల్‌ ప్రకారం డివిజన్ల వారీగా పర్యటన

  • షాడో అభ్యర్థిగా ప్రచారమంతా తమ భుజాలపైనే..

  • పోల్‌ మేనేజ్‌మెంట్‌ అంతా వారి చేతిలోనే..

  • ఎప్పటికప్పుడు వ్యూహాలు పన్నుతున్న యువనేతలు

హైదరాబాద్‌ సిటీ, నవంబర్‌ 23 (ఆంధ్రజ్యోతి):

ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుతోంది. పోలింగ్‌కు ఇంకా వారమే మిగిలి ఉంది. అన్ని పార్టీల్లోనూ అభ్యర్థులు క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల కంటే వారి తనయులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గెలుపు కోసం తాపత్రయంపడుతున్నారు. ప్రచార భారాన్నంతా భుజాన వేసుకొని షాడో అభ్యర్థులుగా పర్యటిస్తున్నారు. మరికొన్ని నియోజకవర్గాల్లో ప్రచారంలో తక్కువగా ఉంటూ మిగతా పోల్‌ మేనేజ్‌మెంట్‌ మొత్తం తనయులు చూసుకుంటున్నారు. తండ్రుల కంటే తనయులు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న తీరు ప్రధానంగా ముషీరాబాద్‌, సికింద్రాబాద్‌, సనత్‌నగర్‌, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి తదితర నియోజకవర్గాల్లో కనిపిస్తోంది.

భారమంతా ఆయనపైనే..

ముషీరాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి అంజన్‌కుమార్‌ యాదవ్‌ బరిలో ఉండగా, ప్రచార పర్వమంతా తనయుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌ చూసుకుంటున్నారు. ఏ రోజుకారోజు తండ్రి షెడ్యూల్‌తోపాటు తన షెడ్యూల్‌ పెట్టుకొని ఇంటింటికి, అపార్ట్‌మెంట్‌ ప్రకారంగా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా అనిల్‌కుమార్‌యాదవ్‌ పోటీ చేసి ఓటమి చెందారు. నియోజకవర్గంలో విస్తృతమైన సంబంధాలతో పాటు యూత్‌ ఫాలోయింగ్‌ బాగా ఉంది. దీంతో పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన కానీ, ప్రచార కార్యక్రమాల్లోనూ అందరి కంటే ముందుగా దూసుకుపోయే నైజమున్నది. గతంలో ఓటమి చవిచూసిన అనిల్‌కుమార్‌ మరోసారి ముషీరాబాద్‌ నుంచి ఎన్నికల బరిలో నిలుస్తారని భావించారు. ఇందుకు భిన్నంగా తండ్రిని బరిలో నిలిపి తనయుడు ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఎంతో రాజకీయ అనుభవం కలిగి ప్రత్యర్థి అభ్యర్థిగా ఉన్న ముఠా గోపాల్‌కు తండ్రి అయితేనే సరైన అభ్యర్థి అవుతారని, కొన్ని వర్గాల ఓట్లు కూడా కొల్లగొట్టవచ్చనే ధీమాతో బరిలో నిలిపారు. ప్రచారం మొత్తం భుజాన వేసుకొని నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

తండ్రి వెంటే తనయుడు

ముషీరాబాద్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ముఠా గోపాల్‌ ఎన్నికల బరిలో ఉండగా, ప్రచారమంతా తనయుడు ముఠా జైసింహ చూసుకుంటున్నారు. జైసింహ కొన్నేళ్లుగా నియోజకవర్గంలో సత్సంబంధాలను ఏర్పాటు చేసుకున్నారు. ఎమ్మెల్యేగా తండ్రి గెలిచినప్పటి నుంచి వెన్నంటి ఉంటూ పార్టీ కార్యక్రమాలు, అభివృద్ధి పనుల్లో భాగస్వాములవుతున్నారు. నియోజకవర్గంలో వ్యక్తిగత ఫాలోయింగ్‌ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓ దశలో ముఠా గోపాల్‌ తన వారసుడిగా జైసింహను ఎన్నికల బరిలో నిలిపేందుకు ప్రయత్నించారు. ఎన్నికల బరిలో నిలిపేందుకు తగిన సమయమున్నదని, ప్రస్తుతం మీరే ఎన్నికల్లో అభ్యర్థిగా నిలువాలని పార్టీ అధినేత సూచించడంతో వెనక్కి తగ్గినట్లు తెలిసింది. ఈసారి ముఠా గోపాల్‌కు విజయం వరిస్తే.. ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో వారసుడిగా బరిలో నిలిచేందుకు అవకాశాలు ఉన్నాయి. దీంతో ముఠా జైసింహ తండ్రి గెలుపు కోసం విస్తృత ప్రచారానికి దిగారు. నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న సత్సంబంధాలతో ఓటర్లను కలుస్తూ తండ్రి గెలుపు కోసం పనిచేస్తున్నారు. ముషీరాబాద్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రచారం కంటే తనయుల ప్రచారమే రసవత్తరంగా ఉంటోంది.

సనత్‌నగర్‌ సైలంట్‌ వార్‌

సనత్‌నగర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ గెలుపుకోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తలసాని తనయుడు సాయికిరణ్‌ కూడా తండ్రి గెలుపుకోసం వ్యూహ ప్రతివ్యూహాల్లో ఉన్నట్లు సమాచారం. నియోజకవర్గంలో సత్సంబంధాలు కలిగిన ఓటర్లను నేరుగా కలుస్తూ తండ్రికి ఓటెయ్యాలని కోరుతున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా మర్రి శశిధర్‌రెడ్డి ఎన్నికల బరిలో నిలవగా, ఆయన తనయుడు ఆదిత్యరెడ్డి ప్రచారానికి దూరంగా ఉన్నారు. తనయుడు కాంగ్రెస్‌లో ఉంటూ ఆ పార్టీ టికెట్‌ కోసం ప్రయత్నించగా టికెట్‌ దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్నారు. తండ్రి గెలుపు కోసం బహిరంగంగా ప్రచారం చేయడం లేదు.

లష్కర్‌లో వారసులొచ్చారు..

సికింద్రాబాద్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మారావు విజయం కోసం తనయులు ప్రచారాన్ని భుజాన వేసుకున్నారు. డివిజన్ల వారీగా పద్మారావుగౌడ్‌ తనయులు బాధ్యత తీసుకొని ప్రచారం చేస్తున్నారు. రామేశ్వర్‌, త్రినేత్ర, కిషోర్‌, కిరణ్‌ ఇలా ఒక్కొక్కరు ఒక్కో డివిజన్‌లో ఓటర్లను కలుస్తున్నారు. సికింద్రాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఆదం సంతోష్‌కుమార్‌ తనయుడు సృజన్‌ కూడా తండ్రి గెలుపు కోసం తనకున్న సత్సంబంధాలతోపాటు పార్టీ నేతలు, కార్యకర్తలను కలుపుకొని ప్రచారం సాగిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి మేకల సారంగపాణి తనయుడు హర్షకిరణ్‌ కూడా ఎన్నికల ప్రచారం చేస్తూనే వ్యుహా ప్రతివ్యూహాలు రచిస్తున్నారు.

మాజీ క్రికెటర్‌ వారసుడు...

జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌కు మద్దతుగా ఆయన తనయుడు అసదుద్దీన్‌ జోరుగా పర్యటిస్తున్నారు. ప్రచారాన్ని భుజాన వేసుకొని నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ప్రచారం చేయడంతోపాటు అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్లు, పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. ప్రచారంలో నేతలు, కార్యకర్తలకు అవసరమైన అన్ని వ్యవహారాలను తనయుడే చూసుకుంటున్నారు.

కుమార్తెలు సైతం..

శేరిలింగంపల్లి కాంగ్రెస్‌ అభ్యర్థి జగదీశ్వర్‌గౌడ్‌ బరిలో ఉండగా ఆయన కూతురు సైతం ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. తన తండ్రిని గెలిపిస్తే నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటారని చెబుతున్నారు. కూకట్‌పల్లి కాంగ్రెస్‌ అభ్యర్థి బండి రమేష్‌ బరిలో ఉండగా, ఆయన కూతురు సైతం ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నారు. ఖైరతాబాద్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి దానం నాగేందర్‌ కూతురు సైతం ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి పర్యటిస్తున్నారు.

Updated Date - 2023-11-23T16:26:32+05:30 IST