NRI: అమెరికాలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష
ABN , First Publish Date - 2023-05-18T20:46:41+05:30 IST
ఈ ఆదివారం జరగబోతున్న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా సన్నాహక సమావేశం, ఏర్పాట్లను తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన పర్యవేక్షించారు.
ఈ ఆదివారం జరగబోతున్న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా సన్నాహక సమావేశం, ఏర్పాట్లను తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సుమారు 2000 పైచిలుకు మంది అన్న గారి అభిమానులు, కుటుంబ సమేతంగా పాల్గొంటారని తెలిపారు. ఆ మహనీయుని స్మరించుకొని, సామాజిక సేవా దృక్పధంతో ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, గౌరవ అతిథులుగా జయరాం కోమటి, మన్నవ సుబ్బారావు హాజరవుతారని తెలిపారు.

ఒక తరం గుండెల్లో కొలువైన దేవుడు, మరో తరం ఆత్మ గౌరవం తట్టి లేపిన ప్రజా నాయకుడు, నేటి తరానికి సమాజ శ్రేయస్సును పాటించాలని నిత్యం గుర్తుచేసే శత వసంతాల శకపురుషుడు ఎన్టీఆర్ అని పలువురు అభిప్రాయపడ్డారు. ఆయన ఆదర్శాలను, జీవితకాలం పాటించిన ప్రమాణాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిదాయకంగా పాటించాలని చెప్పారు. సుదూర ప్రాంతాలలో ఉన్నా ఆయన జన్మదిన పండుగను జరుపుకొని, ఆయన ఆశయాలకు పునరంకితమవ్వాలని సూచించారు. అన్నగారి అశేష అభిమానుల సమక్షంలో, సహకారంతో ఈ కార్యక్రమాన్ని అంగ రంగ వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు.
స్వతహాగా భోజన ప్రియుడైన అన్న గారి శత జయంతి కార్యక్రమంలో విదేశాలలో మొదటి సారిగా అచ్చమైన 100 రకాల తెలుగింటి సంప్రదాయ వంటకాలను సిద్ధం చేసి, కార్యక్రమానికి హాజరయ్యే అభిమానులకు, మహిళలకు, చిన్నారులకు అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం ఒక చిరకాల జ్ఞాపకంగా తెలుగు వారి మదిలో మిగిలిపోయేలా నిర్వాహకులు ముందుకు సాగుతున్నారు.
ఈ కార్యక్రమంలో సుధీర్ కొమ్మి,అనిల్ ఉప్పలపాటి, యశస్వి బొద్దులూరి, సాయి బొల్లినేని,కార్తీక్ కోమటి, భాను మాగులూరి, రవి అడుసుమిల్లి, యలమంచిలి చౌదరి, యువ సిద్దార్ధ్ బోయపాటి తదితరులు పాల్గొన్నారు.



