Tiruppavai: గోత్రనామాలు చెప్పి పాదాలకు నమస్కరించడం...

ABN , First Publish Date - 2023-01-07T23:07:16+05:30 IST

వ్యక్తిగత కారణాలు, అవసరాల కోసం కాకుండా పశువుల్నీ, గోకులవాసుల్నీ కాపాడుకోవడానికి కృష్ణుడు ఏడునాళ్లు... ఆణ్డాళ్ తిరుప్‌పావై తమిళ్ష మూలంలోని శైలితో, శిల్పంతో తెలుగులో అనువాదం, అవగాహన: రోచిష్మాన్

Tiruppavai: గోత్రనామాలు చెప్పి పాదాలకు నమస్కరించడం...
Andal Tiruppavai Pasuram 24

ధనుర్మాసం తిరుప్‌పావై మాసం. వసంతమాసంలో కోయిల నాదంలాగా ధనుర్మాసంలో ఆణ్డాళ్ తిరుప్‌పావై పల్లవిస్తుంది. ఆణ్డాళ్ శ్రీ కృష్ణుడి భక్తురాలు. మార్గశిరంలో‌ తెల్లవారు జామునే లేచి తలారా స్నానంచేసి నోము నోచుకుని కృష్ణుణ్ణి‌ ఆరాధించాలని గోపకన్యల్ని పిలవడం నుండీ తిరుప్‌పావై పాసురాలు మొదలౌతాయి. మనం ఈ పాసురాల్ని అవగతం చేసుకుంటూ వెళితే ఆణ్డాళ్ చెప్పేది మనకు హృదయంగమం ఔతుంది. రోజుకో పాసురమ్‌గా ధనుర్మాసం ముప్పైరోజులూ తిరుప్‌పావై మనతోనూ, మనలోనూ మెదులుతూ ఉంటుంది. ఇవాళ ధనుర్మాసం ఇరవైనాలుగోరోజు; తిరుప్‌పావై ఇరవైనాలుగో పాసురమ్ రోజు.

పాసురమ్ 24

సింహాసనంపై ఆసీనమవమని క్రితం పాసురమ్‌లో కోరుకున్నాక, ఆసీనుడైన కృష్ణుడికి తదుపరి విజ్ఞాపనగా ఆణ్డాళ్ ఇరవైనాలుగో పాసురాన్ని అందించింది; మనమూ అందుకుందాం రండి...

మూలం-

అన్ఱు ఇవ్వులగమ్ అళన్దాయ్ అడిపోఱ్ట్రి;

సెన్ఱఙ్గుత్ తెన్నిలఙ్‌గై సెఱ్ట్రాయ్ తిఱల్ పోఱ్ట్రి;

పొన్ఱచ్ చగడమ్ ఉదైత్తాయ్ పుగళ్ష్ పోఱ్ట్రి;

కన్ఱు కునిలాయ్ ఎఱిన్దాయ్ కళ్షల్ పోఱ్ట్రి;

కున్ఱు కుడైయాయ్ యెడుత్తాయ్ గుణమ్ పోఱ్ట్రి;

వెన్ఱు పగైకెడుక్కుమ్ నిన్‌కైయిల్ వేల్ పోఱ్ట్రి;

ఎన్ఱెన్ఱుమ్ సేవగమ్ ఏత్తిప్ పఱైకొళ్వాన్

ఇన్ఱు యామ్ వన్దోమ్ ఇరఙ్గేలోరెమ్‌పావాయ్!

తెలుగులో-

ఆనాడు ఈ లోకాన్ని కొలిచావు పాదానికి అభివాదం;

వెళ్లి దక్షిణాన ఉన్న లంకను నాశనం చేశావు ధైర్యానికి అభివాదం;

ధ్వంసమయ్యేట్లు శకటాన్ని తన్నావు యశస్సుకు అభివాదం;

ఉండేలు రాయిలాగా దూడను విసిరేశావు మువ్వలకు అభివాదం;

కొండను గొడుగులా ఎత్తావు గుణానికి అభివాదం;

గెలిచి విరోధుల్ని నిర్మూలించిన నీ చేతిశూలానికి అభివాదం;

అన్ని వేళలా నీ వీరాన్ని కీర్తిస్తాం; తప్పెటను తీసుకోవాడానికి

ఈనాడు మేం వచ్చాం అనుగ్రహించు; ఓలాల నా చెలీ!

అవగాహన-

గోత్రనామాలు చెప్పి పాదాలకు నమస్కరించడం అభివాదం అవుతుంది. కృష్ణుడికి అభివాదం చేస్తూ ఈ పాసురాన్ని రూపొందించింది ఆణ్డాళ్.

"ఆనాడు ఈ లోకాన్ని కొలిచావు..." అంటూ వామనావతారంలో పాద‌ంతో లోకాన్ని కొలిచిన ఉదంతాన్ని చెప్పింది ఆణ్డాళ్. "ఈ పాదమే కదా యిలయెల్ల కొలిచినది" అనీ, "చెలఁగి వసుధఁ గొలిచిన నీ పాదము" అనీ అన్నమయ్య కూడా అన్నారు.

"వెళ్లి దక్షిణాన ఉన్న లంకను నాశనం చేశావు" అని రామావతారంలో లంకను నాశనం చేసిన ఉదంతాన్నీ, "ధ్వంసమయ్యేట్లు శకటాన్ని తన్నావు" అని శకటాసుర సంహారాన్నీ చెప్పింది ఆణ్డాళ్. "పగటునఁ దనమీఁదఁ బారవచ్చిన బండి పగుఁల దన్నినవాఁడు..." అని అన్నమయ్య కూడా అన్నారు‌.

"ఉండేలు రాయిలాగా దూడను విసిరేశావు" అని అంటూ దూడ రూపంలో తనను చంపడానికి వచ్చిన వత్సాసురుణ్ణి చెట్టుకు గుద్దుకుని చచ్చిపోయేట్లు కృష్ణుడు విసిరేస్తాడు. ఆ విసిరెయ్యడాన్ని ఉండేలు (ఒడిసెల)తో రాయిని విసిరికొట్టినట్లు అని గొప్పగా చెప్పింది. "కొండను గొడుగులా ఎత్తావు" అని అంటూ గోవర్ధనగిరిని ఎత్తడాన్ని చెప్పింది.

"గుట్టున నావులకొఱకు వేలనే కొండ

పట్టి యెత్తినవాఁడు..."

అని అన్నమయ్య కూడా అన్నారు. వ్యక్తిగత కారణాలు, అవసరాల కోసం కాకుండా పశువుల్నీ, గోకులవాసుల్నీ కాపాడుకోవడానికి కృష్ణుడు ఏడునాళ్లు గోవర్ధనగిరిని ఎత్తిపట్టుకున్నాడు. అది దయాగుణం. అందుకే ఆణ్డాళ్ ఈ సందర్భంలో "గుణానికి అభివాదం" అని అంది; అదీ ఆణ్డాళ్ గొప్పతనం‌. "గెలిచి విరోధుల్ని నిర్మూలించిన నీ చేతిశూలానికి.." అంటూ కృష్ణుడు విరోధుల్ని చంపినవాడు అని తెలియజేస్తోంది. "అన్ని వేళలా నీ వీరాన్ని కీర్తిస్తాం; తప్పెటను పొందడానికి ఈనాడు మేం వచ్చాం, అనుగ్రహించు" అని అడుగుతోంది ఆణ్డాళ్.

తొట్టతొలి పాసురమ్‌లో "నారాయణుడే మనకు తప్పెటను ఇస్తాడు" అని చెప్పింది ఆణ్డాళ్. ఇక్కడ నేరుగా కృష్ణుణ్ణి తమకు ఆ తప్పెటను ఇవ్వమంటోంది. తప్పెట అనేది అనుగ్రహానికి ప్రతీక. అనుగ్రహాన్ని అనుగ్రహించమని దైవాన్ని అర్థిస్తోంది ఆణ్డాళ్.

"అభివాదం, అభివాదం..." కృష్ణుడి పాదానికీ, ధైర్యానికీ, యశస్సుకూ, మువ్వలకూ, గుణానికీ,‌ శూలానికీ "అభివాదం" అంటూ ఇక్కడ సాంద్రమైన రచనాసంవిధానాన్ని ప్రకటించింది ఆణ్డాళ్.

ఆణ్డాళ్ ఈ పాసురమ్ మొదటిపంక్తిని 'ఆనాడు' అనే పదంతో మొదలుపెట్టి చివరిపంక్తిని 'ఈనాడు' అనే పదంతో మొదలుపెట్టింది. రచనాసంవిధానంపై ఉన్నతమైన అవగాహన ఉన్నవాళ్లే ఇలా చెయ్యగలరు. ఈ పాసురమ్ శైలి, శిల్పం గొప్పగా ఉన్నాయి.

ఆణ్డాళ్ తిరుప్‌పావై పాసురాల లింక్

తిరుప్‌పావై పరిచయం, వివరణ కోసం ఈ లింక్‌పై క్లిక్ చెయ్యండి

Rochishmon02.jpeg

రోచిష్మాన్

9444012279

Updated Date - 2023-01-08T13:48:40+05:30 IST