Sons of the Farmer- Lazy : రైతు- సోమరి కొడుకులు

ABN , First Publish Date - 2023-04-08T00:01:40+05:30 IST

ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. కష్టపడి పని చేసేవాడు. పండిన పంటను అమ్మి తన కుటుంబాన్ని పోషించేవాడు. ఆయనకు నలుగురు కొడుకులు. వారంతా సోమరులు. ఏ పని చేసేవాళ్లు కాదు. నాన్న కాయాకష్టం మీద బతికేవాళ్లు. అది అతనికి నచ్చేది కాదు.

Sons of the Farmer- Lazy : రైతు- సోమరి కొడుకులు

ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. కష్టపడి పని చేసేవాడు. పండిన పంటను అమ్మి తన కుటుంబాన్ని పోషించేవాడు. ఆయనకు నలుగురు కొడుకులు. వారంతా సోమరులు. ఏ పని చేసేవాళ్లు కాదు. నాన్న కాయాకష్టం మీద బతికేవాళ్లు. అది అతనికి నచ్చేది కాదు. ఎలాగైనా పిల్లలను ప్రయోజకుల్ని చేయాలని కలగనేవాడు. అయితే వారు మాత్రం సోమరులుగానే ఉండేవాళ్లు.

ఆ రైతుకు జబ్బు చేసింది. వయసుపైబడింది. దీంతో మంచానికే పరిమితమయ్యాడు. ఒక రోజు తన నలుగురు కొడుకులను పిలిచాడు. ‘ఇక నా పని అయిపోతోంది. చేసినన్ని రోజులు కష్టపడ్డాను. ఇక ఓపిక లేదు. మీరు ఎలా బతుకుతారో ఏమో’ అన్నాడు. నలుగురు కొడుకులు కిందకి తల దించుకుని ఉన్నారు. ‘ఓరి బడవల్లారా.. మీకో విషయం చెబుతా. బాగుపడండి. మన చేనులో ఓ కుండ ఉంది. అందులో బంగారు నాణేలు ఉన్నాయి’ అన్నాడు. అందరి ముఖాలు వెలిగిపోయాయి. ‘నేను ఆ బంగారు నాణేలను కుండలో ఎక్కడ పూడ్చిపెట్టానో మర్చిపోయా. చేనును తవ్వి తీసుకోండి’ అన్నాడు. ఆ మాటలు వినగానే కష్టజీవుల్లా అందరూ చేనుకు పయనమయ్యారు. మట్టిలో వెతకటం ప్రారంభించారు. రెండు రోజుల పాటు వెతికి ఆయాసంతో తండ్రి దగ్గరకు వచ్చారు.

రైతు విషయం తెలుసుకున్నాడు. అవునా! అయితే ఓ పని చేయండి. ఎలాగూ మట్టిని తవ్వారు కాబట్టి మీరు విత్తనాలు చల్లండి అన్నాడు. ఆ కొడుకులు వెంటనే సంతకు పోయి మంచి విత్తనాలు తీసుకొచ్చారు. అదృష్టవశాత్తూ వానపడింది. పదును అయిన నేలలో విత్తనాలను చల్లేసరికి పంట మొలకెత్తింది. ఇంకో వాన పడటంతో పంట బాగా పండింది. కొంత ధాన్యం ఇంట్లోకి తీసుకుని మిగతాది సంతలో అమ్ముకొచ్చారు. మంచి లాభం వచ్చింది. ఈ విషయం తండ్రి దగ్గరకు వచ్చి చెప్పారు. ‘మీరు కష్టపడండి. చేనులో కుండలేదు. అసలు బంగారం లేనే లేదు. మీరు కష్టపడి పని చేస్తే ఇలా చేను పండుతుంది. బంగారం లాంటి ధాన్యం మీ చేతులోకి వస్తుంది. మీ కాళ్లమీద మీరు నిలదొక్కుకుంటారు’ అంటూ రైతు చెప్పాడు. పిల్లలకు విషయం అర్థమైంది. సిగ్గుపడ్డారు. ఆ రోజు నుంచి తండ్రిమాట జవదాటకుండా కష్టపడ్డారు.

Updated Date - 2023-04-08T00:01:40+05:30 IST