Yeddyurappa: యడియూరప్ప ఇంటిపై రాళ్ల దాడి
ABN , First Publish Date - 2023-03-28T03:04:37+05:30 IST
కర్ణాటకలో రిజర్వేషన్ల వివాదం అగ్గిరాజేసింది. రిజర్వేషన్ల తేనెతుట్టెను కదిపిన ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై.. తనకు కాట్లు పడ్డా ప్రజలకు తీపిని అందిస్తానంటూ సోమవారం సంచలన ప్రకటన చేశారు.
రిజర్వేషన్ల వివాదంపై బంజారా, బోవి
కులస్థుల భగ్గు.. కర్ణాటకలో ఆందోళనలు
శికారిపురలో 144 సెక్షన్ అమలు
బెంగళూరు, మార్చి 27(ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో రిజర్వేషన్ల వివాదం అగ్గిరాజేసింది. రిజర్వేషన్ల తేనెతుట్టెను కదిపిన ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై.. తనకు కాట్లు పడ్డా ప్రజలకు తీపిని అందిస్తానంటూ సోమవారం సంచలన ప్రకటన చేశారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణతో తమకు అన్యాయం చేశారంటూ బంజారా, బోవి కులస్థులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. శివమొగ్గ జిల్లా శికారిపురలో బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప నివాసం ఎదుట ధర్నా నిర్వహించిన ఆందోళనకారులు ఆయన ఇంటిపై రాళ్ల వర్షం కురిపించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో శికారిపుర పట్టణంలో 144 సెక్షన్ విధించారు. షెడ్యూల్డు కులాల రిజర్వేషన్ వర్గీకరణతో తమకు చేటు జరుగుతుందని ఈ రెండు కులాల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల జరిపిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణలో ఎస్సీల్లో రైట్ విభాగానికి 5.5 శాతం, లెఫ్ట్ విభాగానికి 6 శాతం, అన్టచబుల్స్కు 4.5 శాతం రిజర్వేషన్ను కల్పించారు. వెరసి ఎస్సీలకు మొత్తం రిజర్వేషన్లు 17 శాతానికి పెరిగాయి. అయితే ఈ రిజర్వేషన్ల విధానం తమకు సమ్మతం కాదంటూ బోవి, బంజారా కులస్థులు పోరు బాట పట్టారు. ఈ రెండు కులాలకు చెందిన ప్రజలు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు నిర్వహించారు.