భద్రతపై మోదీ నోరు విప్పరేం?
ABN , Publish Date - Dec 22 , 2023 | 03:43 AM
పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభ, రాజ్యసభల్లో ఎందుకు నోరు విప్పడం లేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు.
బీజేపీకి ప్రజాస్వామ్యం అంటే లెక్కలేదు: ఖర్గే
ఎంపీల సస్పెన్షన్కు నిరసనగా విపక్షాల ర్యాలీ
న్యూఢిల్లీ, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభ, రాజ్యసభల్లో ఎందుకు నోరు విప్పడం లేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. బీజేపీ ఎంపీలకు ప్రజాస్వా మ్యం అంటే లెక్కలేదని ఆరోపించారు. ఈ మేరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాల నుంచి 143 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్ను నిరసిస్తూ ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ నుంచి విజయ్ చౌక్ వరకు గురువారం మార్చ్ నిర్వహించారు. ఖర్గే ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన ప్రదర్శనలో లోక్తంత్రకో బచావ్, సేవ్ డెమొక్రసీ అని రాసి ఉన్న బ్యానర్ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై ఉభయ సభల్లో ప్రజలకు వివరణ ఇస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్లో జరిగిన ఘటనపై ప్రధాని మోదీ టీవీల్లోనూ, వారాణసీ, అహ్మదాబాద్లో జరిగిన సభల్లోనూ మాట్లాడారని, చట్టసభలో మాత్రం నోరు విప్పలేదన్నారు. చట్ట ప్రకారం ప్రధాని ముందుగా సభలో మాట్లాడాలని, మోదీ మాత్రం సభలో తప్ప అన్ని చోట్ల మాట్లాడుతున్నారని విమర్శించారు. భద్రతా వైఫల్యంపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని ప్రతిపక్ష సభ్యులు ఉభయ సభల చైర్మన్లను ఎన్నిసార్లు అభ్యర్థించినా అంగీకరించ లేదని చెప్పారు. బీజేపీ ఎంపీలు ఉద్దేశపూర్వకంగా సభను భగ్నం చేశారని తెలిపారు. కాగా, ఎంపీల బహిష్కరణకు నిరసనగా ఇండియా బ్లాక్ నేతలు జంతర్ మంతర్ వద్ద శుక్రవారం నిరసన ప్రదర్శన చేస్తారని ఖర్గే ఈ సందర్భంగా పేర్కొన్నారు.