ఏమిటీ ఆర్టికల్ 370?
ABN , First Publish Date - 2023-12-12T04:11:16+05:30 IST
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని తాజాగా సుప్రీం కోర్టు సమర్థించింది. ఈ నేపథ్యంలో అసలు ఆర్టికల్ 370 ఏంటి? ఆది నుంచి ఎందుకు వివాదాస్పదమైంది?
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని తాజాగా సుప్రీం కోర్టు సమర్థించింది. ఈ నేపథ్యంలో అసలు ఆర్టికల్ 370 ఏంటి? ఆది నుంచి ఎందుకు వివాదాస్పదమైంది? ఎందుకు రద్దయింది? అనే విషయాలు ఆసక్తిగా మారాయి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 జమ్ముకశ్మీర్కు ప్రత్యేక స్వయం ప్రతిపత్తిని కల్పించింది. 1947లో భారత్-పాకిస్థాన్ విభజన జరిగినప్పుడు జమ్ముకశ్మీర్ రాజు హరిసింగ్ పలు షరతులతో భారత్లో విలీనాని కి అంగీకరించారు. ఈ క్రమంలోనే ఆర్టికల్ 370 తెరమీదికి వచ్చింది. ఈ ఆర్టికల్ జమ్ముకశ్మీర్కు స్వతంత్ర హోదా కల్పిస్తుంది. అంటే, భారత రాజ్యాంగం ఈ రాష్ట్రానికి వర్తించదు. కేవలం రక్షణ, విదేశాంగ వ్యవహారాలు మినహా ఈ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి చట్టం చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం జమ్ముకశ్మీర్ ప్రభుత్వ అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇక, ఈ ఆర్టికల్ ద్వారా జమ్ము కశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులు కూడా సంక్రమించాయి.
ఆర్టికల్ 370 ఏం చెబుతోంది?
+ కీలకమైన ఆర్టికల్ 356(రాష్ట్రపతి పాలన) జమ్ముకశ్మీర్కు వర్తించదు.
+ 1976 నాటి పట్టణ భూమి చట్టం కూడా ఇక్కడి వారికి వర్తించదు. దేశంలోని ఇతర ప్రాంతాల వారు ఎవరూ ఈ రాష్ట్రంలో భూమి కొనలేరు. పౌరసత్వం, ఆస్తియాజమాన్యం, ప్రాథమిక హక్కులు కశ్మీరీలకు ప్రత్యేకంగా ఉంటాయి.
2019 ఆగస్టు 5న రద్దు
ఆర్టికల్ 370పై 2015 నుంచి వివాదాలు ముదిరాయి. ఆ సంవత్సరం డిసెంబరులో ఈ ఆర్టికల్ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. దీనిని విచారించిన అప్పటి సీజేఐ జస్టిస్ హెచ్.ఎల్. దత్తు ధర్మాసనం.. ఆర్టికల్ను రద్దు చేసే అధికారం ఉందని తేల్చి చెప్పింది. అయితే.. ఇది పార్లమెంటు ద్వారానే జరగాల్సి ఉందని పేర్కొంది. అయితే, జమ్ము కశ్మీర్ హైకోర్టు మాత్రం ఆర్టికల్ 370 శాశ్వత నిబంధన అని పేర్కొనడం గమనార్హం. సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2019లో ఆగస్టు 5న ఆర్టికల్ 370ని రద్దు చేసింది. జమ్ముకశ్మీర్ రాష్ట్రాన్ని జమ్ముకశ్మీర్, లద్ధాఖ్గా విభజించింది. కాగా, ఆర్టికల్ 370 రద్దును అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు.
370 రద్దు తర్వాత ఏం జరిగింది?!
+ జమ్ముకశ్మీర్కు ప్రత్యేక పతాకం, రాజ్యాంగం, గీతం రద్దయ్యాయి. అన్ని కేంద్ర చట్టాలు ఇక్కడ అమలవుతాయి. స్వయం ప్రతిపత్తి ఉండదు.
+ జమ్ము కశ్మీర్లో ఎవరైనా భూమి కొనుగోలు చేయొచ్చు. బదిలీ చేసుకోవచ్చు.
+ కశ్మీరీలకు ద్వంద్వ పౌరసత్వం వర్తించదు.
+ ఆర్పీసీ(రణబీర్ శిక్షా స్మృతి) స్థానంలో ఐపీసీ(భారత శిక్షా స్మృతి) అమలు
+ జిల్లా స్థాయి అభివృద్ధి మండళ్లను(డీడీసీ) ఏర్పాటు చేశారు. మండలి సభ్యులు నేరుగా ప్రజలతోనే ఎన్నిక కావాల్సి ఉంది.
- సెంట్రల్ డెస్క్