Share News

మూడేళ్లుగా ఏం చేస్తున్నారు?

ABN , First Publish Date - 2023-11-21T04:04:50+05:30 IST

అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను తొక్కిపెడుతున్న కేరళ గవర్నర్‌ వైఖరిపై ఏం సమాధానం చెబుతారని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

మూడేళ్లుగా ఏం చేస్తున్నారు?

బిల్లుల పెండింగ్‌పై తమిళనాడు గవర్నర్‌కు సుప్రీం ప్రశ్న

కేరళ గవర్నర్‌ వైఖరిపై ఏం చెబుతారని కేంద్రానికి నోటీసులు

న్యూఢిల్లీ, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను తొక్కిపెడుతున్న కేరళ గవర్నర్‌ వైఖరిపై ఏం సమాధానం చెబుతారని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ మేరకు నోటీసులు కూడా జారీ చేసింది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గత 21 నెలలుగా గవర్నర్‌ మహమ్మద్‌ ఆరిఫ్‌ఖాన్‌ పరిష్కరించకుండా ఉద్దేశపూర్వకంగా తొక్కి పెడుతున్నారని కేరళలోని పినరయి విజయన్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. కేరళ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది కేకే వేణుగోపాల్‌ వాదనలు వినిపించారు. గత 21 నెలలుగా గవర్నర్‌ ఆరిఫ్‌ ఖాన్‌ వద్ద 8 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ధర్మాసనం జోక్యం చేసుకుని.. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతుందని ప్రశ్నించింది. బిల్లుల ఆమోదంలో జరుగుతున్న జాప్యానికి కారణాలు వివరించాలని కోరింది. ఈ క్రమంలో కేంద్రానికి, గవర్నర్‌ ఆరిఫ్‌ ఖాన్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. మరోవైపు, తమిళనాడు గవర్నర్‌ వర్సెస్‌ ప్రభుత్వానికి సంబంధించిన పిటిషన్‌ పైనా సుప్రీంకోర్టు విచారణ జరిపింది. తమిళనాడు గవర్నర్‌ బిల్లులు పరిష్కరించకుండా మూడేళ్లుగా ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. ఇదిలా ఉండగా, హైకోర్టు జడ్జిల బదిలీలకు సంబంధించి కొలీజియం చేసిన సిఫార్సుల పట్ల కేంద్రం అనుసరిస్తున్న తీరుపై సోమవారం సుప్రీంకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. పంపిన జాబితాలో కొందర్నే ఎంపిక చేసే ‘పిక్‌ అండ్‌ చూజ్‌’ విధానాన్ని అవలంబిస్తోందని, అది సమాజానికి మంచి సంకేతాలు పంపించదని తెలిపింది. ఇలాంటి చర్యల ద్వారా ఎలాంటి సందేశాన్ని పంపించాలని అనుకుంటున్నారని ప్రశ్నించింది.

Updated Date - 2023-11-21T04:04:51+05:30 IST