మణిపూర్లో శాంతిస్థాపనకు కట్టుబడి ఉన్నాం
ABN , First Publish Date - 2023-06-01T00:37:49+05:30 IST
మణిపూర్లో శాంతిని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్షా స్పష్టం చేశారు....
కేంద్ర మంత్రి అమిత్ షా..ఇంఫాల్, మోరేలో పర్యటన
మోరే(మణిపూర్), మే 31: మణిపూర్లో శాంతిని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్షా స్పష్టం చేశారు. శరణార్ధి శిబిరాల్లో తలదాచుకుంటున్న వారిని అతి త్వరలో వారి సొంతిళ్లకు పంపిస్తామని హామీ ఇచ్చారు. మణిపూర్ పర్యటనలో ఉన్న అమిత్ షా.. ఈ మేరకు మూడో రోజు బుధవారం ఇంపాల్, మోరే తదితర ప్రాంతాలను సందర్శించారు. ఆయా ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులపై రాష్ట్ర, కేంద్ర ఉన్నతాధికారులతో వేర్వేరుగా సమీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ఆదేశించారు. నిత్యావసరాలు, అత్యవసర సేవల కోసం చురాచాంద్పూర్, మోరే, కాంగ్పోక్పి ప్రాంతాల్లో హెలికాప్టర్ సేవలను కొనసాగిస్తామని చెప్పారు. మయన్మార్ సరిహద్దులో ఉండే మోరే పట్టణాన్ని సందర్శించిన అమిత్ షా. కుకీ వర్గానికి చెందిన వివిధ సంఘాల నేతలు, వర్తక సంఘాల ప్రతినిధులతోనూ మాట్లాడారు. శాంతిస్థాపన అంశంలో ప్రభుత్వానికి సహకరిస్తామని వారంతా హోం మంత్రికి తెలియజేశారు.