6 రెట్లు పెరిగిన ఓటర్లు
ABN , First Publish Date - 2023-02-06T03:23:35+05:30 IST
దేశంలో 1951 నుంచి ఓటర్ల సంఖ్య దాదాపు 6 రెట్లు పెరిగింది. 2023 జనవరి 1 నాటికి దేశంలో మొత్తం 94,50,25,694 మంది ఓటర్లు ఉన్నారు.
జనవరి 1 నాటికి 94.50 కోట్ల మంది
రాజ్యాంగం అమలులోకి వచ్చాక
తొలి ఓటరు జాబితాలో 17.32 కోట్లు
దేశంలో 6 రెట్లు పెరిగిన ఓటర్లు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: దేశంలో 1951 నుంచి ఓటర్ల సంఖ్య దాదాపు 6 రెట్లు పెరిగింది. 2023 జనవరి 1 నాటికి దేశంలో మొత్తం 94,50,25,694 మంది ఓటర్లు ఉన్నారు. రాజ్యాంగం అమలులోకి వచ్చాక 1951లో దేశంలో తొలిసారి ఎన్నికలు జరిగాయి. అప్పుడు 17.32 కోట్ల ఓటర్లు ఉండగా, వారిలో 45.67 శాతం మంది మాత్రమే ఓటు వేశారు. తర్వాత ఓటర్ల సంఖ్య, ఓటు హక్కు వినియోగదారుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని 75 శాతానికి పెంచాలని ఎన్నికల సంఘం ప్రయత్నించినప్పటికీ, మూడింట ఒక వంతు(30 కోట్ల)మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోలేదు. దాంతో 91.20 కోట్ల మంది ఓటర్లకు 67.40 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది. ఓటు వినియోగించుకోని వారిలో అధికంగా పట్టణ ప్రాంత ప్రజలు, యువత, వలసదారులు ఉన్నారు.ఈ ఏడాది పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ, వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు ఉన్నందున ఓటింగ్ శాతాన్ని పెంచాలని ఈసీ లక్ష్యం నిర్దేశించుకుంది.