మణిపూర్లో హక్కుల ఉల్లంఘన
ABN , First Publish Date - 2023-07-14T02:17:32+05:30 IST
భారత్లో మానవ హక్కుల పరిస్థితి, ముఖ్యంగా మణిపూర్లో ఇటీవల కాలంలో చోటుచేసుకున్న ఘర్షణలపై యూరోపియన్ పార్లమెంటు గురువారం తీర్మానాన్ని ఆమోదించింది.
భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
యూరోపియన్ పార్లమెంటు తీర్మానం
మోదీ ఫ్రాన్స్ పర్యటన వేళ పరిణామం
లండన్, జులై 13: భారత్లో మానవ హక్కుల పరిస్థితి, ముఖ్యంగా మణిపూర్లో ఇటీవల కాలంలో చోటుచేసుకున్న ఘర్షణలపై యూరోపియన్ పార్లమెంటు గురువారం తీర్మానాన్ని ఆమోదించింది. ఫ్రాన్స్లోని స్ట్రాస్బౌర్గ్లో జరిగిన ఈ పార్లమెంటు భేటీలో ‘అత్యావశ్యక తీర్మానం’ పేరుతో దీనిపై చర్చించింది. ఫ్రాన్స్ అఽధ్యక్షుని ఆహ్వానం మేరకు భారత ప్రధాని మోదీ ఆ దేశంలో పర్యటిస్తున్న సమయంలోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. గ్రూప్ ఆఫ్ ద ప్రోగ్రసివ్ అలయెన్స్ ఆఫ్ సోషలిస్ట్స్ అండ్ డెమొక్రాట్స్ సభ్యుడు పియర్రీ లరౌటురౌ ‘ఇండియా: మణిపూర్ పరిస్థితి’ పేరుతో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మతపరంగా, జాతుల పరంగా జరుగుతున్న అల్లర్లను అదుపు చేసేందుకు, మతపర అల్పసంఖ్యాకులను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని యూరోపియన్ పార్లమెంటు భారత ప్రభుత్వాన్ని కోరింది. ఈ హింసపై స్వతంత్ర దర్యాప్తు జరిపేందుకు వివిధ సంస్థలకు అవకాశం ఇవ్వాలని కోరింది. యూరోపియన్ యూనియన్-భారత సంబంధాల్లో వాణిజ్యంతో పాటు మానవ హక్కులకు కూడా చోటు కల్పించాలని కోరింది. భావ ప్రకటన స్వేచ్ఛ, మత స్వాతంత్య్రం, పౌర సంఘాలకు చోటు తగ్గుతుండడం తదితర అంశాలపై భారత్లోని ఉన్నత స్థాయి వర్గాల వద్ద తరచూ ప్రస్తావిస్తుండాలని సభ్య దేశాలను కోరింది. దీనిపై భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్లీ గురువారం ఢిల్లీలో మాట్లాడుతూ ఈ తీర్మానం వలసవాద మనస్తత్వానికి నిదర్శనమని, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం ఆమోదయోగ్యం కాదని అన్నారు. మణిపూర్లో శాంతి నెలకొల్పడానికి న్యాయవ్యవస్థ సహా అందరూ కృషి చేస్తున్నారని చెప్పారు.