Share News

Article 370 : ఆర్టికల్‌ 370 రద్దుపై నేడే సుప్రీం తీర్పు

ABN , First Publish Date - 2023-12-11T03:23:59+05:30 IST

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్‌ 370ని కేంద్రప్రభుత్వం రద్దు చేయటం రాజ్యాంగబద్ధమేనా అన్నదానిపై సుప్రీంకోర్టు సోమవారం తీర్పును వెలువరించనుంది.

 Article 370 : ఆర్టికల్‌ 370 రద్దుపై నేడే సుప్రీం తీర్పు

కేంద్రం నిర్ణయం రాజ్యాంగబద్ధమేనా అన్నదానిపై స్పష్టత

జమ్మూకశ్మీర్‌ అంతటా భద్రత కట్టుదిట్టం

370ని సుప్రీం పునరుద్ధరిస్తుందన్న ఆశతో కశ్మీర్‌ పార్టీలు

కోర్టు తీర్పు ఎలా వచ్చినా గౌరవించాలన్న బీజేపీ

న్యూఢిల్లీ, డిసెంబరు 10: జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్‌ 370ని కేంద్రప్రభుత్వం రద్దు చేయటం రాజ్యాంగబద్ధమేనా అన్నదానిపై సుప్రీంకోర్టు సోమవారం తీర్పును వెలువరించనుంది. ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌ నేతృత్వంలో జస్టి్‌సలు సంజయ్‌ కిషన్‌ కౌల్‌, సంజీవ్‌ ఖన్నా, బీఆర్‌ గవాయ్‌, సూర్యకాంత్‌లతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇవ్వనున్న తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆర్టికల్‌ 370 రద్దును వ్యతిరేకిస్తూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఆగస్టు 2వ తేదీన విచారణను ప్రారంభించింది. 16 రోజులపాటు విచారణ జరిపిన ధర్మాసనం సెప్టెంబర్‌ 5వ తేదీన తన తీర్పును రిజర్వులో పెడుతున్నట్లు ప్రకటించింది. విచారణ సందర్భంగా కేంద్రంతోపాటు ఆర్టికల్‌ 370 రద్దు అనుకూల పక్షాల తరఫున, వ్యతిరేక పక్షాల తరఫున పలువురు సీనియర్‌ న్యాయవాదులు వాదనలు వినిపించారు. జమ్ముకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన జమ్ము కశ్మీర్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని కూడా పలువురు పిటిషనర్లు వ్యతిరేకించారు. కాగా, సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జమ్ముకశ్మీర్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

రాజ్యాంగ వ్యతిరేకం: ముఫ్తీ

సుప్రీంకోర్టు తీర్పు జమ్ముకశ్మీర్‌ ప్రజలకు అనుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నట్లు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా చెప్పారు. ఆర్టికల్‌ 370 రద్దు రాజ్యాంగవ్యతిరేక చర్య మాత్రమేగాక జమ్ముకశ్మీర్‌ ప్రజలకు ఇచ్చిన హామీల ఉల్లంఘన కూడా అని, సుప్రీంకోర్టు తీర్పు దీనినే స్పష్టం చేస్తుందని భావిస్తున్నానని పీడీపీ అధ్యక్షురాలు ముఫ్తీ పేర్కొన్నారు. బీజేపీ ఎజెండాను సుప్రీంకోర్టు ముందుకు తీసుకెళ్లకూడదని, దేశ సమగ్రతను కాపాడాలన్నారు. డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ ఆజాద్‌ పార్టీ అధినేత గులాం నబీ ఆజాద్‌.. ఆర్టికల్‌ 370తో జమ్ముకశ్మీర్‌ ప్రజలు భావోద్వేగపూరిత సంబంధాన్ని కలిగి ఉన్నారని, దానిని పునరుద్ధరించాలని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అందరూ గౌరవించాల్సిందేనని బీజేపీ జమ్ముకశ్మీర్‌ అధ్యక్షుడు రవీందర్‌ రైనా చెప్పారు.

Updated Date - 2023-12-11T03:24:00+05:30 IST