Share News

Pakistan, China behind the attacks in Poonch! : లద్దాఖ్‌ నుంచి భారత్‌ దృష్టి మరల్చేందుకే?

ABN , Publish Date - Dec 23 , 2023 | 05:05 AM

కశ్మీర్‌ లోయలో రెండేళ్ల నుంచి ముష్కర మూకలు మళ్లీ అలజడి సృష్టిస్తుండడం వెనుక చైనా కుతంత్రం ఉందా..? మరీ ముఖ్యంగా పూంచ్‌-రాజౌరీ ప్రాంతంలో ఇటీవలి దాడులు పాకిస్థాన్‌తో కలిసి డ్రాగన్‌ పన్నిన పన్నాగమేనా..

Pakistan, China behind the attacks in Poonch! : లద్దాఖ్‌  నుంచి భారత్‌ దృష్టి మరల్చేందుకే?

పూంచ్‌లో దాడుల వెనుక పాక్‌, చైనా!

భారత రక్షణ శాఖ వర్గాల అనుమానం

శ్రీనగర్‌, డిసెంబరు 22: కశ్మీర్‌ లోయలో రెండేళ్ల నుంచి ముష్కర మూకలు మళ్లీ అలజడి సృష్టిస్తుండడం వెనుక చైనా కుతంత్రం ఉందా..? మరీ ముఖ్యంగా పూంచ్‌-రాజౌరీ ప్రాంతంలో ఇటీవలి దాడులు పాకిస్థాన్‌తో కలిసి డ్రాగన్‌ పన్నిన పన్నాగమేనా..? ఔననే అంటున్నాయి భారత రక్షణ శాఖలోని ఉన్నత స్థాయి వర్గాలు. భారత్‌ బలగాల దృష్టిని లద్దాఖ్‌ నుంచి కశ్మీర్‌ వైపు మళించాలనేది చైనా వ్యూహంగా పేర్కొన్నాయి. గల్వాన్‌ ఘటన తర్వాత ఎదురుదాడి చేయడంలో నిపుణులైన రాష్ట్రీయ రైఫిల్స్‌ను భారత్‌ పూంచ్‌ నుంచి లద్దాఖ్‌కు తరలించిందని.. దీనిని అవకాశంగా తీసుకున్న చైనా.. కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ఎగదోసి, భారత్‌పై ఒత్తిడి తేవాలని ఎత్తు వేసిందని, ఆ దేశం మద్దతు తోనే పాక్‌ ఇదంతా చేస్తోందని తెలిపాయి. గురువారం పూంచ్‌ జిల్లాలో జరిగిన ఉగ్ర దాడిలో ఐదుగురు భారత సైనికులు చనిపోయారు. పూంచ్‌ జిల్లా డెరా కి గలి ప్రాంతంలో నెల వ్యవధిలో ఆర్మీ వాహనాలపై ఇది రెండో దాడి. ఏప్రిల్‌ 20న సైన్యం, ప్రత్యేక బలగాలు రాజౌరీ కలాకోట్‌లో ఉగ్రవాదుల ఏరివేత చేపట్టగా జరిగిన దాడిలో ఇద్దరు కెప్టెన్లు సహా ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మే నెలలోనూ ఐదుగురు సైనికులు మృతిచెందారు. మొత్తమ్మీద 2021 నుంచి 35 మంది సైనికులు వీర మరణం పొందారు. రెండేళ్లుగా ఈ రీజియన్‌ ఉగ్ర చర్యలకు కేంద్రంగా మారింది అనేందుకు ఈ గణాంకాలే ఉదాహరణ అని చెబుతున్నారు. భారత భద్రతా దళాలపై దాడులే 25-30 మంది ఉగ్రవాదులను పాకిస్థాన్‌ దట్టమైన పూంచ్‌ అడవుల్లోకి పంపిందని రక్షణ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

Updated Date - Dec 23 , 2023 | 05:05 AM