న్యాయవ్యవస్థలో మహిళల స్థితి మారాలి

ABN , First Publish Date - 2023-03-26T00:47:46+05:30 IST

న్యాయమూర్తులు, న్యాయాధికారులుగా పనిచేస్తున్న స్ర్తీ పురుషుల మధ్య నిష్పత్తి అత్యంత అధ్వాన్నంగా ఉన్నదని సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు. ఈ అంతరాన్ని తొలగించాల్సిందేనని స్పష్టం చేశారు. ‘‘తమిళనాడు కోర్టుల్లో 50వేలమంది పురుష ..

న్యాయవ్యవస్థలో మహిళల స్థితి మారాలి

చెన్నై, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): న్యాయమూర్తులు, న్యాయాధికారులుగా పనిచేస్తున్న స్ర్తీ పురుషుల మధ్య నిష్పత్తి అత్యంత అధ్వాన్నంగా ఉన్నదని సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు. ఈ అంతరాన్ని తొలగించాల్సిందేనని స్పష్టం చేశారు. ‘‘తమిళనాడు కోర్టుల్లో 50వేలమంది పురుష న్యాయవాదులు ఉండగా, మహిళా న్యాయవాదులు కేవలం ఐదు వేలమందే ఉన్నారు’’ అని ఆయన వివరించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొలీజియం ఇటీవల మహిళలు, అణగారిన వర్గాల ప్రాతినిధ్యం పెంచడానికి తగినంత ప్రయత్నం చేస్తోందని జస్టిస్‌ చంద్రచూడ్‌ వివరించారు. మద్రాస్‌ హైకోర్టులో తమిళం ప్రవేశపెట్టాలన్న సీఎం స్టాలిన్‌ వినతిపై సీజేఐ స్పందిస్తూ.. ఇందుకు రాజ్యాంగ సవరణ అవసరమవుతుందని, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 348 ప్రకారం సుప్రీంకోర్టుతో పాటు అన్ని హైకోర్టుల్లో విచారణ ఆంగ్లంలో ఉండాలని పేర్కొన్నారు. చెన్నై, ముంబై, కోల్‌కతా వంటి నగరాల్లో సుప్రీంకోర్టు ప్రాంతీయ బెంచ్‌లను ఏర్పాటు చేయాలన్న స్టాలిన్‌ వినతిపైనా సీజేఐ స్పందించారు. దేశంలో ఎక్కడి నుంచైనా న్యాయవాదులు సుప్రీంకోర్టుకు హాజరయ్యేలా హైబ్రిడ్‌ వ్యవస్థలను ప్రవేశపెట్టడం ద్వారా అందరికీ అందుబాటులో ఉండేలా ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. కాగా, దేశంలోని చాలా కోర్టుల్లో మౌలిక సదుపాయాలు లేవని కేంద్రమంత్రి కిరెన్‌ రిజిజు ముందే జస్టిస్‌ చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-03-26T00:47:46+05:30 IST