ఉత్తర గాజాలో సింహభాగం ఖాళీ!
ABN , First Publish Date - 2023-11-21T04:03:03+05:30 IST
హమా్సను తుడిచిపెట్టడమే తమ లక్ష్యమంటూ ఐదు వారాల క్రితం గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభించిన ఇజ్రాయెల్..

హమా్సను తుడిచిపెట్టడమే తమ లక్ష్యమంటూ ఐదు వారాల క్రితం గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభించిన ఇజ్రాయెల్.. సోమవారానికి దాదాపుగా ఉత్తర గాజాలో కీలక ప్రాంతాల్లో పాగా వేసింది. ఇజ్రాయెల్ దాడులు, షెల్లింగ్తో పౌరులంతా దక్షిణ గాజాకు పయనమవ్వడంతో.. ఉత్తరాది దాదాపుగా ఖాళీ అయిపోయింది. ప్రతి నలుగురు పౌరుల్లో ముగ్గురు నిర్వాసితులుగా మారారని ఐరాస వెల్లడించింది. ఆస్పత్రుల్లో రోగులు, వైద్య సిబ్బంది, ఐరాస శిబిరాల్లో తలదాచుకుంటున్నవారు మినహా.. పౌరులంతా దక్షిణాదికి వెళ్లిపోయినట్లు ఐడీఎఫ్ వర్గాలు వెల్లడించాయి. ఐడీఎఫ్ వర్గాలు సోమవారం ఉత్తర గాజాలోని పలు ప్రాంతాల్లో సందర్శనకు అంతర్జాతీయ మీడియాకు అవకాశమిచ్చింది.
షిఫా ఆస్పత్రితోపాటు.. హమాస్ సొరంగాలను మీడియా ప్రతినిధులకు చూపించింది. ఇమరోవైపు ఉత్తర గాజా భూభాగంలో అక్కడక్కడా మినహా.. హమాస్ ప్రతిఘటన ఎదురవ్వడం లేదని, త్వరలో బందీలు, హమాస్ ఉనికిని గుర్తించేందుకు సొరంగాల్లో ఆపరేషన్ చేపడతామని ఐడీఎఫ్ వెల్లడించింది. గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అల్-షిఫాను ఐదు రోజుల క్రితం దిగ్బంధించిన ఐడీఎఫ్.. అదే తరహాలో గాజాలోని రెండో అతిపెద్ద దవాఖానాగా పేరున్న ఇండోనేషియా ఆస్పత్రిని చుట్టుముట్టింది. ఆస్పత్రికి 100 మీటర్ల దూరంలో యుద్ధ ట్యాంకులను మోహరించింది. ఈ ఆస్పత్రిపైకి ఐడీఎఫ్ షెల్లింగ్కు పాల్పడుతోందని గాజా ఆరోగ్యశాఖ ఆరోపించింది. ఈ దాడుల్లో 8 మంది చనిపోయినట్లు వివరించింది. సెంట్రల్ గాజాలోని ఐరాస నిర్వాసితుల శిబిరంపైనా ఇజ్రాయెల్ షెల్లింగ్ జరిపిందని, ఈ దాడుల్లో 12 మంది మృతిచెందినట్లు ‘వఫా’ వార్తా సంస్థ వీడియోలను ప్రసారం చేసింది. రఫా సరిహద్దు సమీపంలో కాల్పుల్లో 15 మంది పౌరులు చనిపోయినట్లు పేర్కొంది. కాగా, గత నెల 7న ఇజ్రాయెల్పై దాడి చేసిన హమాస్ ఉగ్రవాదులు.. బందీల్లో కొందరిని అల్-షిఫా ఆస్పత్రిలో నిర్బంధించినట్లు ఐడీఎఫ్ సీసీటీవీల సాయంతో గుర్తించింది. - సెంట్రల్ డెస్క్