Share News

Tamilnadu: సుప్రీం కోర్టు ఆదేశాల తరువాత.. 10 బిల్లుల్ని వెనక్కి పంపిన గవర్నర్

ABN , First Publish Date - 2023-11-16T21:52:24+05:30 IST

శాసనసభ(Assembly) ఆమోదం పొందిన బిల్లులపై గవర్నర్లు స్పందించకుండా ఉండటం సరికాదని సుప్రీంకోర్టు(Supreme Court) సీరియస్ అయిన నేపథ్యంలో.. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి(RN Ravi) ఈ మేరకు స్పందించారు.

Tamilnadu: సుప్రీం కోర్టు ఆదేశాల తరువాత.. 10 బిల్లుల్ని వెనక్కి పంపిన గవర్నర్

చెన్నై: శాసనసభ(Assembly) ఆమోదం పొందిన బిల్లులపై గవర్నర్లు స్పందించకుండా ఉండటం సరికాదని సుప్రీంకోర్టు(Supreme Court) సీరియస్ అయిన నేపథ్యంలో.. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి(RN Ravi) ఈ మేరకు స్పందించారు. అసెంబ్లీ ఆమోదం పొందిన 10 బిల్లుల్ని ప్రభుత్వానికి తిప్పి పంపారు. ఇందులో అప్పటి అన్నాడీఎంకే ప్రభుత్వం ఆమోదించిన 2 బిల్లులు కూడా ఉన్నాయి.

అనేక రాష్ట్రాల్లో గవర్నర్లకు, ముఖ్యమంత్రులకు మధ్య పొసగడం లేదు. దీంతో కీలక బిల్లుల ఆమోదంతో తీవ్ర జాప్యం జరుగుతోంది. కొన్ని రోజుల క్రితం ఇదే విషయాన్ని కొందరు సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వివాదంపై చర్చించిన గవర్నర్లు తాము ఎన్నికైన ప్రభుత్వాలు కాదని గుర్తెరగాలని స్పష్టం చేసింది.

శాసనసభలు ఆమోదించిన బిల్లులకు ఆమోద ముద్ర వేయకుండా గవర్నర్లు సతాయించడం వల్ల రాష్ట్రాలు తప్పనిసరై న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వస్తోందని సర్వోన్నత న్యాయస్థానం ఆవేదన వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకు కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితిని గవర్నర్లే కల్పిస్తున్నారని వ్యాఖ్యానించింది.


ఈ ట్రెండ్‌కు ఇప్పటికైనా తెర వేయాలని గవర్నర్లను కోరింది. పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ను విచారిస్తున్న సమయంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. మొత్తం 7 బిల్లులను గవర్నర్‌ తొక్కిపట్టారని రాష్ట్ర ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకువచ్చింది.

ఈ సందర్భంగా జస్టిస్‌ చంద్రచూడ్‌ కొందరు గవర్నర్ల వైఖరిని తప్పుబట్టారు. ఇటీవల తెలంగాణ గవర్నర్‌ కూడా ఇలాగే బిల్లులను సుదీర్ఘకాలం పెండింగ్‌లో పెట్టి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన తర్వాతే ఆమోదించారని ప్రస్తావించారు. కేరళలో కూడా గవర్నర్‌ కొన్ని బిల్లులు తొక్కి పట్టారని సీనియర్‌ న్యాయవాది కేకే వేణుగోపాల్‌ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

కోర్టు వ్యాఖ్యలపై స్పందించిన తమిళనాడు గవర్నర్ కీలక వివరాలు పొందుపరచలేదనే కారణంతో బిల్లుల్ని తిప్పి పంపారు. బీజేపీ నియమించిన గవర్నర్(Governor) ఉద్దేశపూర్వకంగా బిల్లుల క్లియరెన్స్‌లో జాప్యం చేశారని, ప్రజలతో ఎన్నికైన పాలకులను అణగదొక్కాలని చూస్తూ రాష్ట్ర అభివృద్ధిని దెబ్బ తీస్తున్నారని అధికార డీఎంకే ఆరోపించింది. గవర్నర్ నిర్ణయాలు ప్రజల అభీష్టాన్ని దెబ్బతీస్తున్నాయన్నారు. సీఎం స్టాలిన్(MK Stalin), గవర్నర్ కు మధ్య కొంత కాలంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇరువురు పరస్పరం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి ఒక్క తమిళనాడులోనే కాదు.. తెలంగాణ, కేరళ తదితర రాష్ట్రాల్లో సైతం ఉంది.

Updated Date - 2023-11-16T21:52:25+05:30 IST