పార్లమెంటు ప్రారంభోత్సవంపై ‘పిల్’ విచారణకు సుప్రీం నిరాకరణ
ABN , First Publish Date - 2023-05-27T04:00:42+05:30 IST
పార్లమెంటు కొత్త భవనాన్ని ప్రధాని మోదీకి బదులుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రారంభింపజేసేలా లోక్సభ సెక్రటేరియట్కు ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన పిల్పై విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది.

న్యూఢిల్లీ, మే 26: పార్లమెంటు కొత్త భవనాన్ని ప్రధాని మోదీకి బదులుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రారంభింపజేసేలా లోక్సభ సెక్రటేరియట్కు ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన పిల్పై విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. సుప్రీం కోర్టు న్యాయవాది జయా సుకిన్ దాఖలు చేసిన ఈ వ్యాజాన్ని జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం శుక్రవారం పరిశీలించింది. ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేయడం వెనుక ఉద్దేశం కోర్టుకు తెలుసని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద దీన్ని విచారించేందుకు నిరాకరిస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. కోర్టు ఖర్చులు వసూలు చేయనందుకు పిటిషనర్ సంతోషించాలని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలోనే తాను వ్యాజ్యాన్ని ఉపసంహరించుకుంటానని పిటిషనర్ కోరగా ధర్మాసనం అంగీకరించింది. కాగా, పార్లమెంటు ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్టు కాంగ్రెస్ సహా 19 ప్రతిపక్ష పార్టీలు బుధవారమే ఒక సంయుక్త ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.