MCD Polls: మూడుసార్లు వాయిదా తర్వాత...కొత్త తేదీ ఫిబ్రవరి 16

ABN , First Publish Date - 2023-02-12T20:16:14+05:30 IST

ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కొత్త తేదీని ప్రకటించారు. ఈనెల 16వ తేదీన ఎంసీడి ఎన్నికలు..

MCD Polls: మూడుసార్లు వాయిదా తర్వాత...కొత్త తేదీ ఫిబ్రవరి 16

న్యూఢిల్లీ: ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) ఎన్నికల కొత్త తేదీని ప్రకటించారు. ఈనెల 16వ తేదీన ఎంసీడి ఎన్నికలు నిర్వహించేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా (VK Saxena) అనుమతి ఇచ్చారు. ఫిబ్రవరి 16న సభను సమావేశ పరచేందుకు ప్రభుత్వం ప్రతిపాదన పంపిందని, సక్సేనా దానికి ఆమోదం తెలిపారని ఎల్జీ కార్యాలయ వర్గాలు తెలిపాయి.

మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం జనవరి 6న తొలి సమావేశం ఏర్పాటు చేయగా సభలో రసాభాస జరగడంతో వాయిదా పడింది. జనవరి 24న జరిగిన రెండో సమావేశం కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంది. దీంతో గత వారంలో మూడోసారి సమావేశం జరిగినప్పటికీ సభ రసాభాసగా ముగిసింది. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నామినేట్ చేసిన 10 మంది ఢిల్లీ కౌన్సిలర్లు ఓటు వేసేందుకు అనుమతించడాన్ని ఆప్ అడ్డుకుంది. దీంతో మూడోసారి కూడా ఎలాంటి ఎన్నికకు నోచుకోకుండా సమావేశం వాయిదా పడింది.

250 స్థానాలున్న ఢిల్లీ మున్సిపాలిటీకి గత డిసెంబర్ 4న ఎన్నికలు జరుగగా, డిసెంబర్ 7న ఫలితాలు వెలువడ్డాయి. ఆప్ 134 సీట్లు గెలుచుకుని, మేయర్ స్థానాన్ని దక్కించుకునేందుకు అవసరమైన సీట్లు గెలుచుకుంది. బీజేపీ 104 వార్డులు గెలుచుకుని రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ 9 సీట్లు గెలుచుకుంది. కాగా, ఆప్ తరఫున ఢిల్లీ మేయర్‌ అభ్యర్థిగా షెల్లీ ఒబెరాయ్ పోటీ పడుతున్నారు. బీజేపీ తరఫున రేఖా గుప్తా పోటీ చేస్తు్న్నారు. డిప్యూటీ మేయర్ పదవికి ఆప్ తరఫున అలెయ్ మొహమ్మద్ ఇక్బాల్, బీజేపీ నుంచి కమల్ బాగ్రి పోటీ పడుతున్నారు. మేయర్, డిప్యూటీ మేయర్‌తో పాటు ఎంసీడీ స్టాడింగ్ కమిటీకి 18 మంది సభ్యులలో ఆరుగురు సభ్యులను నేరుగా ఎన్నుకోవాల్సి ఉంది. మిగిలిన 12 మందిని జోనల్ ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకుంటారు. కాగా, కీలకమైన ఆరుగురు సభ్యుల ఎన్నికలో మూడు సీట్లు ఆప్ గెలుచుకోనుండగా, బీజేపీ రెండు సీట్లు దక్కుంచుకోనుంది. కీలకమైన ఆరో సీటు విషయంలోనే సభలో గందరగోళం తలెత్తింది. నామినేట్ సభ్యులను ఓటింగ్‌కు అనుమతిస్తే బీజేపీకి ఆ సీటు దక్కే అవకాశం ఉంది. ఇది ఆప్‌కు ఆందోళన కలిగిస్తోంది. దీనిపై ఆప్ నిరసనకు దిగడంతో గత సమావేశం వాయిదా పడింది. ఈ క్రమంలోనే ఎంసీడీ ఎన్నికలు పదేపదే వాయిదా పడుతుండటంపై సుప్రీంకోర్టును ఆప్ సర్కార్ ఆశ్రయించింది. నామినేటెడ్ సభ్యులకు ఓటింగ్ హక్కు నిరాకరిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇవ్వడంతో నాలుగోసారి ఎంసీడీ సమావేశానికి మార్గం సుగమమైంది.

Updated Date - 2023-02-12T20:16:16+05:30 IST