సిసోడియాను నెట్టిన సీసీటీవీ ఫుటేజీని భద్రపర్చండి
ABN , First Publish Date - 2023-06-02T02:49:31+05:30 IST
ఆప్ నేత సిసోడియా(51)ను పోలీసులు కోర్టు ఆవరణలో బలవంతంగా నెట్టిన ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని భద్రపరచాలని గురువారం ప్రత్యేక కోర్టు సంబంధిత అధికార్లను ఆదేశించింది.
న్యూఢిల్లీ, జూన్ 1: ఆప్ నేత సిసోడియా(51)ను పోలీసులు కోర్టు ఆవరణలో బలవంతంగా నెట్టిన ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని భద్రపరచాలని గురువారం ప్రత్యేక కోర్టు సంబంధిత అధికార్లను ఆదేశించింది. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో అరెస్టయిన ఆయనను విచారణ నిమిత్తం మే 23న కోర్టుకు హాజరుపరిచారు. తిరిగి వెళ్తున్న సమయంలో ఆయన మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేస్తుండగా భద్రతా సిబ్బంది ఆయన మెడపట్టి లాక్కెళ్లారు. దీనిపై ఆయన కోర్టుకు ఫిర్యాదు చేయగా సీసీటీవీ ఫుటేజీని భద్రపరచాలని జడ్జి ఆదేశించారు. మరోవైపు ఆయనను కోర్టుకు హాజరుపరచడం కన్నా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరపడమే మేలని పోలీసులు కూడా దరఖాస్తు సమర్పించారు.
మంచి విధానమే అయితే ఎందుకు వెనక్కి తీసుకున్నట్లు?
ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎక్సయిజ్ విధానం అంత మంచిదే అయితే ఎందుకు ఉపసంహరించుకున్నారని గురువారం ఢిల్లీ హైకోర్టు సిసోడియాను ప్రశ్నించింది. ఈ కేసులో సహ నిందితునిగా ఉన్న విజయ్ నాయర్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్పై వాదనలు విన్న జస్టిస్ దినేష్ కుమార్ శర్మ..సిసోడియా న్యాయవాదిని ఉద్దేశించి ఈ ప్రశ్న వేశారు. దీనిపై ఆయన నుంచి స్పష్టమైన సమాధానం రాబట్టాలన్నారు.