Share News

Rice Exports: గతేడాదితో పోల్చితే బియ్యం ధరలు ఎక్కువే.. సర్వేలో ఆసక్తికర విషయాలు

ABN , First Publish Date - 2023-11-29T12:19:34+05:30 IST

గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం పట్టణ ప్రాంత ప్రజలు బియ్యానికి ఎక్కువ ధరలు చెల్లిస్తున్నారని కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.

Rice Exports: గతేడాదితో పోల్చితే బియ్యం ధరలు ఎక్కువే.. సర్వేలో ఆసక్తికర విషయాలు

ఢిల్లీ: గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం పట్టణ ప్రాంత ప్రజలు బియ్యానికి ఎక్కువ ధరలు చెల్లిస్తున్నారని కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. దేశ వ్యాప్తంగా 315 జిల్లాల్లోని పట్టణాల నుండి 22 వేలకుపైగా పౌరుల అభిప్రాయాలు సేకరించిన సర్వే బృందం పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ప్రతి పట్టణంలోని మూడు నివాసాల గృహిణుల్లో ఒకరు ఈ సంవత్సరం బియ్యానికి 20% లేదా అంతకంటే ఎక్కువ ధర చెల్లించినట్లు తెలిపారు.

పట్టణ భారతీయులు ఎక్కువగా ఉపయోగించే తొలి మూడు బియ్యం రకాల్లో సోనా మసూరి, బాస్మతి, పొన్ని రైస్ ఉన్నట్లు సర్వేలో తేలింది. బియ్యం ధరల పెరుగుదల కారణాలను కూడా సర్వే వివరించింది. ఉత్తరాదిలో పండించే ప్రీమియం రకం, బాస్మతి బియ్యం ఎగుమతులు పెరగడమే ధరల పెరుగుదలకు కారణమని సర్వే పేర్కొంది. అక్టోబర్‌లో భారత్ మధ్యప్రాచ్యం, యూరప్‌లకు సుమారు 5,00,000 మెట్రిక్ టన్నుల బాస్మతి బియ్యాన్ని ఎగుమతి చేసే ఒప్పందాలపై సంతకం చేసింది.


ఇవి దీర్ఘకాలంగా ఉండే ఫైన్ రైస్ రిటైల్ ధరల్లో పెరుగుదలకు దారితీసింది. కరోనా మహమ్మారి మధ్య ఎగుమతులను పెంచడానికి ప్రభుత్వం గతంలో బాస్మతి బియ్యం కనీస ఎగుమతి ధరను టన్నుకు 1,200 డాలర్ల నుండి 950 డాలర్లకు తగ్గించింది. తాజాగా ధాన్యం దిగుబడి పెరిగినప్పటికీ రెండు నెలలుగా అన్ని రకాల బియ్యం ధరలు 10-15% పెరిగాయని సర్వే పేర్కొంది.

దేశీయ మార్కెట్‌లో ధరల పెరుగుదలను తగ్గించడానికి ప్రభుత్వం జులైలో బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతిని నిషేధించింది. అయినా బియ్యం ధరలు తగ్గలేదని సర్వే పేర్కొంది. కొవిడ్-19 సంక్షోభంతో దేశంపై పడిన ఆర్థిక ప్రభావాన్ని సర్వే నొక్కి చెప్పింది. కరోనా వల్ల పెరిగిన బియ్యం ధరలతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపింది.

బియ్యం ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, మిగులును ఎగుమతి చేసే ముందు దేశీయ డిమాండ్ కి అనుగుణంగా నిల్వలు ఉంచాలని సూచించింది. వినియోగదారులు బియ్యంపై ఆధారపడటాన్ని తగ్గించుకొని మినుములు, గోధుమలు, ఓట్స్ మొదలైన కార్బోహైడ్రేట్లతో కూడిన ఆహారం తీసుకోవాలని కోరింది.

Updated Date - 2023-11-29T12:20:20+05:30 IST