IMF: 2023లో మరింత గడ్డు పరిస్థితి.. మూడింట ఒక వంతు దేశాల్లో తీవ్ర ఆర్థిక మాంద్యం

ABN , First Publish Date - 2023-01-02T17:40:54+05:30 IST

కొత్త సంవత్సరం ప్రారంభంలోనే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ప్రపంచ ఆర్థిక మాంద్య పరిస్థితులపై కలవరపాటుకు గురిచేసే ప్రకటన చేసింది. గత ఏడాది...

IMF: 2023లో మరింత గడ్డు పరిస్థితి.. మూడింట ఒక  వంతు దేశాల్లో తీవ్ర ఆర్థిక మాంద్యం

వాషింగ్టన్: కొత్త సంవత్సరం ప్రారంభంలోనే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) ప్రపంచ ఆర్థిక మాంద్య పరిస్థితులపై కలవరపాటుకు గురిచేసే ప్రకటన చేసింది. గత ఏడాది (2022) కంటే 2023లో గడ్డు పరిస్థితులు ఎదురవుతాయని, ప్రపంచంలోని మూడింట ఒక వంతు దేశాలు ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటాయని హెచ్చరించింది. అమెరికా, ఈయూ, చైనా దేశాలు సైతం ఆర్థిక మందగమనాన్ని (Economic Slowdown) చవిచూస్తాయని చెప్పింది. సీబీసీ న్యూస్ ప్రోగ్రాం 'ఫేస్ ది నేషన్'లో ఐఎంఎఫ్ చీఫ్ క్రిష్టాలినా జార్జీవా (Kristalina Georgieva) ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం పది నెలలకు పైగా కొనసాగుతుండటం, ద్రవ్యోల్బణం చుక్కలనంటుతుండటం, పెరుగుతున్న వడ్డీ రేట్లు, చైనాలో కరోనా తిరిగి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక పరిస్థితిని జార్జీవా విశ్లేషించారు.

''2023లో ప్రపంచంలోని మూడింట ఒక వంతు దేశాలు ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటాయి. 2022లో ఎదుర్కొన్న పరిస్థితుల కన్నా 2023లో ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలవుతుంది. చైనాలో తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఏర్పడి ఆ దేశ వృద్ధి రేటు పడిపోతుంది. చైనా, ఐరోపా సమాఖ్యలోని పలు దేశాలు ఆర్థిక మందగమన పరిస్థితులు ఎదుర్కొంటాయి. ప్రపంచ ఆర్థిక వృద్ధి కూడా తగ్గిపోనుంది. 2021లో 6 శాతంగా ఉన్న వృద్ధి 2022లో 3.2కు పడిపోగా, 2023లో 2.7కు దిగజారే పరిస్థితి కనిపిస్తోంది'' అని ఆమె చెప్పారు.

చైనాకు చెడుకాలం...

రాబోయే రెండు నెలలు చైనాకు చాలా గడ్డుకాలమని, ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు ఆ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయని, వార్షిక వృద్ధిరేటు ఎన్నడూ లేనంతగా పడిపోతుందని జార్జీవా చెప్పారు. ఉత్పత్తుల నాణ్యత తగ్గి, ఖర్చులు అధికమవుతాయని చెప్పారు. ఐఎంఎఫ్ వడ్డీ రేట్లు పెంచినా కూడా ప్రయోజనం ఉండదని, సమగ్ర ఆర్థిక ప్రపంచ వ్యవస్థ ప్రయోజనాలు మనం కోల్పోతే మరింత పేదవాళ్లుగా మారుతామని అన్నారు.

Updated Date - 2023-01-02T17:44:43+05:30 IST