మహారాష్ట్రలో మళ్లీ రాజకీయ సంక్షోభం!

ABN , First Publish Date - 2023-04-20T01:45:25+05:30 IST

మహారాష్ట్రలో మరోసారి రాజకీయ సంక్షోభం ముదురుతోంది. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్సీపీ) సీనియర్‌ నేత అజిత్‌ పవార్‌ తమ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరుతున్నారంటూ వచ్చిన వార్తలు తీవ్ర దుమారం రేపాయి....

మహారాష్ట్రలో మళ్లీ రాజకీయ సంక్షోభం!

దుమారం రేపుతున్న అజిత్‌ పవార్‌ అంశం

ముంబై, ఏప్రిల్‌ 19 : మహారాష్ట్రలో మరోసారి రాజకీయ సంక్షోభం ముదురుతోంది. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్సీపీ) సీనియర్‌ నేత అజిత్‌ పవార్‌ తమ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరుతున్నారంటూ వచ్చిన వార్తలు తీవ్ర దుమారం రేపాయి. బతికున్నంత కాలం ఎన్సీపీ కోసమే పనిచేస్తానని అజిత్‌ పవార్‌ వివరణ ఇచ్చినప్పటికీ రచ్చ కొనసాగుతోంది. పవార్‌ తన వర్గంతో బీజేపీలో చేరితే తాము ప్రభుత్వంలో ఉండమని ఏక్‌నాథ్‌ షిండే నాయకత్వంలోని శివసేన హెచ్చరించింది. ఇక, అతి త్వరలో దేశంలో రెండు రాజకీయ భూకంపాలను చూడబోతున్నామని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ కుమార్తె, పార్టీ ఎంపీ సుప్రియ సూలే మరింత హీట్‌ పెంచారు. ఈ మేరకు సుప్రియ సూలే విలేకరులతో మాట్లాడుతూ.. ‘రాబోయే 15 రోజుల్లో రెండు రాజకీయ భూకంపాలు చూస్తాం. ఒకటి ఢిల్లీలో మరొకటి మహారాష్ట్రలో’ అని వ్యాఖ్యానించారు. అయితే, సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న 15 మంది శివసేన ఎమ్మెల్యేల అనర్హత కేసు అంశంపైనే ఆమె పరోక్షంగా వ్యాఖ్యానించి ఉంటారని ఎన్సీపీకి చెందిన ఓ నేత వెల్లడించారు. ఇక, పార్టీ ఎమ్మెల్యేలతో అజిత్‌ పవార్‌ ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారనే వార్తలను ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ ఖండించారు.

Updated Date - 2023-04-20T01:45:25+05:30 IST