Sachin Pilot : పైలట్‌ కొత్త పార్టీ?

ABN , First Publish Date - 2023-06-07T05:47:36+05:30 IST

రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు భారీ షాక్‌ తగలనుందా?.. అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది! కాంగ్రెస్‌ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ కొత్త పార్టీ

Sachin Pilot : పైలట్‌ కొత్త పార్టీ?

జైపూర్‌, జూన్‌ 6: రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు భారీ షాక్‌ తగలనుందా?.. అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది! కాంగ్రెస్‌ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ కొత్త పార్టీ పెట్టనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆయన ఈ నెల 11న తన తండ్రి రాజేశ్‌ పైలట్‌ వర్థంతి సందర్భంగా నిర్వహించనున్న సభలో నిర్ణయాన్ని ప్రకటిస్తారని ఆ వర్గాలు చెబుతున్నాయి. రాజస్థాన్‌ సీఎం గెహ్లోత్‌, పైలట్‌ మధ్య ఉన్న విభేదాలు కొన్ని నెలలుగా తీవ్రరూపం దాల్చాయి. వివిధ అంశాల్లో గెహ్లోత్‌ ప్రభుత్వ తీరుపై పైలట్‌ ధ్వజమెత్తుతున్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలని, ఆ పార్టీ నాయకురాలు, మాజీ సీఎం వసుంధర రాజేపై విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. కానీ ఈ డిమాండ్‌ను గెహ్లోత్‌ సర్కారు పట్టించుకోకపోవడం పైలట్‌ ఆగ్రహానికి కారణమవుతోంది. పైలట్‌ తన డిమాండ్ల సాధన కోసం ఏప్రిల్‌ 11న నిరాహార దీక్ష చేశారు. గత నెల 11 నుంచి 5 రోజుల పాటు పాదయాత్ర నిర్వహించారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్‌ గాంధీ గత నెల 29న చర్చలు జరిపారు. ఇదిలా ఉండగా, కొత్త పార్టీ ఏర్పాటు గ్రౌండ్‌వర్క్‌ కోసం పైలట్‌.. ప్రశాంత్‌ కిశోర్‌కు చెందిన సంస్థ ‘ఐప్యాక్‌’ సాయం తీసుకుంటున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. కొత్త పార్టీకి ప్రగతిశీల కాంగ్రెస్‌ అనే పేరు పరిశీలిస్తున్నట్టు సమాచారం.

Updated Date - 2023-06-07T06:34:57+05:30 IST