అజిత్కు పవార్ షాక్!
ABN , First Publish Date - 2023-06-11T02:46:47+05:30 IST
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తన అన్న కుమారుడు, మహారాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్కు గట్టి షాకిచ్చారు.
ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్
ముంబై/న్యూఢిల్లీ, జూన్ 10: ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తన అన్న కుమారుడు, మహారాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్కు గట్టి షాకిచ్చారు. తమ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు (వర్కింగ్ ప్రెసిడెంట్లు)గా కుమార్తె సుప్రియా సూలే, తన సన్నిహితుడు ప్రఫుల్ పటేల్ను నియమించారు. పైగా సుప్రియకు ప్రత్యేకించి మహారాష్ట్ర బాధ్యతలు అప్పగించడం ద్వారా తన వారసురాలు ఆమేనని తేల్చేశారు. శనివారం ఢిల్లీలో ఎన్సీపీ 24వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో అజిత్, ఛగన్ భుజ్బల్, సునీల్ తత్కరే, ఫౌజియా ఖాన్ తదితరుల సమక్షంలో పవార్ ఈ ప్రకటన చేశారు. ‘ప్రఫుల్ మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, జార్ఖండ్, గోవా రాష్ట్రాల ఇన్చార్జిగా వ్యవహరిస్తారు. రాజ్యసభలో కూడా ఆయనే ఎన్సీపీ ఇన్చార్జిగా ఉంటారు. ఇక సుప్రియకు మహారాష్ట్రతో పాటు పంజాబ్, హరియాణా బాధ్యతలు అప్పగించారు. మహిళలు, యువజన, విద్యార్థి విభాగాలకు ఇన్చార్జిగా ఉంటారు. లోక్సభలో పార్టీ ఇన్చార్జి కూడా ఆమే’ అని తెలిపారు. ఎన్సీపీ కేంద్ర ఎన్నికల అథారిటీ చైర్పర్సన్గానూ సుప్రియనే నియమించారు. ఈ ప్రకటనతో మనస్తాపానికి గురైన అజిత్.. మీడియాతో మాట్లాడకుండానే పార్టీ కార్యాలయం నుంచి మౌనంగా వెళ్లిపోయారు. అయితే ఆ తర్వాత ఇద్దరినీ అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఎన్సీపీలో ఇంతవరకు కార్యనిర్వాహక అధ్యక్ష పదవి లేదు. ఇప్పుడు పవార్ ఏకంగా రెండు పదవులు సృష్టించారు. అజిత్కు మొండిచేయిపై సాయంత్రం విలేకరులు ప్రశ్నించగా.. ఆయన ఇప్పటికే మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని పవార్ బదులిచ్చారు. పైగా వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామక నిర్ణయంలో ఆయన కూడా భాగస్వామి అని చెప్పారు. అజిత్ మనస్తాపానికి గురయ్యారన్న వార్తలను ప్రస్తావించగా.. సుప్రియ పేరును ఆయనే ప్రతిపాదించారని.. ఇక మనస్తాపానికి అవకాశం ఎక్కడని తెలిపారు. భవిష్యత్లో సుప్రియ, ప్రఫుల్లో ఎవరు ఎన్సీపీ అధ్యక్షుడవుతారని అడుగగా.. ఇప్పుడైతే ఆ పదవి ఖాళీగా లేదని, ఖాళీ అయినప్పుడు మాట్లాడతామని పవార్ అన్నారు.