నార్వే రచయిత జాన్ ఫోసెకు సాహిత్య నోబెల్
ABN , First Publish Date - 2023-10-06T04:23:22+05:30 IST
నార్వే రచయిత జాన్ ఒలావ్ ఫోసె 2023 సంవత్సరానికిగాను నోబెల్ సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు.
స్టాక్హోం, అక్టోబరు 5: నార్వే రచయిత జాన్ ఒలావ్ ఫోసె 2023 సంవత్సరానికిగాను నోబెల్ సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు. నోరువిప్పి చెప్పలేని ఎన్నో అంశాలకు గొంతుగా ఆయన సాహిత్యం నిలబడిందని రాయల్ స్వీడిష్ అకాడమీ శ్లాఘించింది. నాటక, గద్య రచయితగా జాన్ ఫొసె ప్రసిద్ధుడు. మేలిమి అనదగ్గ గద్య కావ్యాలెన్నో ఆయన వెలువరించారు. వాటిలో ‘సెప్టోలజీ’ని రెండేళ్ల క్రితం పూర్తిచేశారు. అలాగే.. 2019లో ‘ద అదర్ నేమ్’, 2020లో ‘ఐ ఈజ్ అనదర్’, 2021లో ‘ద న్యూ నేమ్’ గ్రంథాలు వెలువడ్డాయి. నార్వే పశ్చిమ తీర ప్రాంతంలో 1959లో ఫోసె జన్మించారు. నార్వేలో ప్రధానంగా మాట్లాడే భాషల్లో ఒకటైన ‘నినో్స్క’లో (నార్త్ జర్మనిక్ మాండలికం) అనేక సాహితీ ప్రక్రియల్లో ఫోసె విస్తారంగా రచనలు చేశారు. నాటకాలు, నవలలు, కవితాసంకలనాలు, వ్యాసాలు, పిల్లల పుస్తకాలు, అనువాద మాధ్యమాల్లో 40కిపైగా పుస్తకాలు వెలువరించారు. నార్వే సాహిత్యంలో ఆయన కొత్త రచనా శైలిని ప్రవేశపెట్టారు. దానిని సాహిత్య విమర్శకులు ‘ఫోసె మినిమలిజమ్’గా వ్యవహరిస్తున్నారు. కాగా, సాహిత్య నోబెల్ అందుకున్న నార్వే రచయితల్లో ఫోసె నాలుగోవారు. ఆయనకు ముందు బ్యోన్స్టానా బ్యోన్సన్, నాట్ హామ్సన్, సిగ్రిడ్ అన్సెట్ ఈ పురస్కారం అందుకున్నారు. 1928 తర్వాత తిరిగి 95 ఏళ్లకు ఫోసె రూపంలో ఈ గౌరవం నార్వేకు దక్కడం విశేషం.