2 వేల నోటు మార్పిడిపై అత్యవసర విచారణకు నో
ABN , First Publish Date - 2023-06-02T02:48:53+05:30 IST
ఎలాంటి పత్రాలు లేకుండానే రూ.2000 నోట్లు మార్చుకోవడానికి అవకాశాన్ని కల్పించడంపై అత్యవసర విచారణ జరపడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.
న్యూఢిల్లీ, జూన్ 1: ఎలాంటి పత్రాలు లేకుండానే రూ.2000 నోట్లు మార్చుకోవడానికి అవకాశాన్ని కల్పించడంపై అత్యవసర విచారణ జరపడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. ఏ విధమైన గుర్తింపు పత్రాలు లేకుండానే పెద్ద నోటు మార్పిడికి అవకాశం కల్పించడంతో చాలా తక్కువ సమయంలోనే 50 వేల కోట్ల విలువైన రెండు వేల నోట్ల మార్పిడి జరిగిందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. దీన్ని నేరస్థులు, టెర్రరిస్టులు అవకాశంగా మార్చుకునే ప్రమాదం ఉందన్నారు. ఈ అంశంపై అత్యవసర విచారణ జరపకుంటే దేశంలోని నల్లధనాన్నంతా తెల్లధనంగా మార్చుకునే ముప్పుందని ఆయన పేర్కొన్నారు. అయితే, ఇలాంటి పిటిషన్లను సమ్మర్ వెకేషన్లో అనుమతించబోమని ధర్మాసనం స్పష్టం చేసింది.