విపక్ష సీఎంలు లేకుండా నేడు నీతి ఆయోగ్ భేటీ
ABN , First Publish Date - 2023-05-27T04:08:01+05:30 IST
ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారమిక్కడ జరిగే నీతి ఆయోగ్ 8వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి బీజేపీయేతర ప్రతిపక్షాల సీఎంలు హాజరు కావడం లేదు.

విపక్ష సీఎంలు లేకుండా నేడు నీతి ఆయోగ్ భేటీ
● జగన్, నవీన్ మాత్రమే హాజరు..ఊరించి కేసీఆర్ డుమ్మా
న్యూఢిల్లీ, మే 26 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారమిక్కడ జరిగే నీతి ఆయోగ్ 8వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి బీజేపీయేతర ప్రతిపక్షాల సీఎంలు హాజరు కావడం లేదు. ఆంధ్రప్రదేశ్, ఒడిసా సీఎంలు వైఎస్ జగన్మోహన్రెడ్డి, నవీన్ పట్నాయక్ మాత్రమే హాజరవుతున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరవుతారని బీఆర్ఎస్ వర్గాలు చెప్పినా చివరిలో ఆయనా మానుకున్నారు. పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవంతో పాటు నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాన్ని కూడా బహిష్కరిస్తున్నామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తెలిపారు. మోదీ ప్రభుత్వ విధానాలకు నిరసనగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలే కాకుండా.. యూపీఏ భాగస్వామ్య పార్టీల సీఎంలు కూడా నీతి ఆయోగ్ భేటీని బహిష్కరిస్తున్నట్లు మీడియాకు చెప్పారు. ఈ రెండు కార్యక్రమాలకు తామూ హాజరు కావడం లేదని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. తొలుత నీతి ఆయోగ్ భేటీకి హాజరై.. తర్వాత ప్రతిపక్షాల నేతలను కలుసుకోవాలని టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ అనుకున్నారు. చివరకు ఆమె కూడా ఈ సమావేశాన్ని బహిష్కరించాలని నిర్ణయించారు. మరోవైపు.. 2045 కల్లా దేశాన్ని అభివృద్ధి చేసేందుకు (వికసిత్ భారత్) రోడ్ మ్యాప్ రూపకల్పనకు గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం అవకాశం కల్పిస్తుందని నీతి ఆయోగ్ ఒక ప్రకటనలో తెలిపింది.