Neuralink: మానవ మెదడులో న్యూరాలింక్ చిప్!
ABN , First Publish Date - 2023-05-27T03:56:52+05:30 IST
మెదడును, కంప్యూటర్ను సరాసరి అనుసంధానించే తమ సాంకేతికత ప్రయాణం ఒక కీలక మైలురాయిని చేరుకుందని టెస్లా అధినేత ఎలాన్ మస్క్కు చెందిన న్యూరాలింక్ సంస్థ తాజాగా ప్రకటించింది.
మనుషులపై ప్రయోగాలకు ఎలాన్ మస్క్ సంస్థకు ఎఫ్డీఏ అనుమతి ఇది మా సాంకేతికతకు ఒక మైలురాయి: న్యూరాలింక్
న్యూఢిల్లీ, మే 26: మెదడును, కంప్యూటర్ను సరాసరి అనుసంధానించే తమ సాంకేతికత ప్రయాణం ఒక కీలక మైలురాయిని చేరుకుందని టెస్లా అధినేత ఎలాన్ మస్క్కు చెందిన న్యూరాలింక్ సంస్థ తాజాగా ప్రకటించింది. మానవ మెదడులో చిప్ అమర్చి పరిశోధనలు చేసేందుకు అమెరికా ఆహార–ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్డీఏ) ఆమోదం తెలిపిందని వెల్లడించింది. ‘‘న్యూరాలింక్ సాంకేతికతలో ఇది చాలా కీలకమైన అడుగు. మా అధ్యయనం మొదలుపెట్టేందుకు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. మెదడులో అమర్చే చిప్ సాయంతో ఆ మనిషి కంప్యూటర్తో సరాసరి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోగలరు. ఇప్పటికే కోతులపై విజయవంతంగా పరీక్షలు నిర్వహించాం. అవి వాటి మెదడుతో
వీడియోగేమ్స్ ఆడాయి. తెరపై కర్సర్ను కదల్చగలిగాయి. మనుషులపైనా విజయవంతమైతే ఈ సాంకేతికతతో చాలా ఉపయోగాలు ఉంటాయి. ముఖ్యంగా దృష్టిని కోల్పోయినవారు, దివ్యాంగులు, కదలలేని పరిస్థితిలో ఉన్నవారికి ఇది ఒక వరమని చెప్పవచ్చు. కేవలం వైద్యపరమైన ఉపయోగాలు మాత్రమే కాక, మున్ముందు మరింత విస్తృతమయ్యే కృత్రిమ మేధ(ఏఐ)ను మనిషి ఎదుర్కొనేందుకు, మానవ మేధస్సును పెంపొందించేందుకు ఇది అవసరం’’ అని న్యూరాలింక్ స్పష్టం చేసింది. అనుమతులు ఇచ్చినప్పటికీ ఎఫ్డీఏ ఈ ప్రయోగాలను నిశితంగా పరిశీలిస్తుందని నిపుణులు చెబుతున్నారు. చిప్లో వాడే లిథియం బ్యాటరీ భద్రత, మెదడు ఆరోగ్యానికి దానివలన కలిగే ప్రమాదంవంటి వాటిపై నియంత్రణ సంస్థ గతంలోనే ఆందోళనలు వ్యక్తం చేసింది. అమెరికా రవాణా శాఖ న్యూరాలింక్ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తోంది. ఎటువంటి భద్రత చర్యలు లేకుండా ప్రమాదకర సూక్ష్మక్రిములను సంస్థ తరలించిందన్న ఆరోపణలపై రవాణా శాఖ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
చిప్ ఎలా పనిచేస్తుంది?
మానవ మెదడు విద్యుత్ సంకేతాల ఆధారంగా శరీరాన్ని నియంత్రిస్తుంది. అదే విధంగా న్యూరాలింక్ చిప్ సైతం మెదడుకు, డిజిటల్ ప్రపంచానికి మధ్య వారిధిలా ఉపకరిస్తుంది. దీనిలో ఉండే చిన్న చిన్న ఎలక్ట్రాడ్లు మెదడు చేసే విద్యుత్ సంకేతాలను గుర్తించి కంప్యూటర్కు పంపిస్థాయి. ఈ సాంకేతికతతో మనిషికి ఉన్న పరిధులన్నీ చెరిగిపోతాయని న్యూరాలింక్ అధినేత మస్క్ చెబుతున్నారు. కేవలం ఊహలతోనే కంప్యూటర్ను నియంత్రించడం, ఎటువంటి సమాచారమైనా లిప్తపాటులో పొందగలగడం వంటి వాటితో మనిషి మేధస్సుకు ఉన్న పూర్తి సామర్ధ్యం వెల్లడవుతుందని ఆయన అంచనా వేస్తున్నారు.