Nadda : ప్రేమ దుకాణం కాదు.. ‘విద్వేష’ మెగా మాల్‌

ABN , First Publish Date - 2023-07-11T04:26:46+05:30 IST

కాంగ్రెస్‌ అగ్ర నేత ప్రచార నినాదం ‘ప్రేమ దుకాణం (మొహ బ్బత్‌ కా దుకాణ్‌)’పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు.

Nadda : ప్రేమ దుకాణం కాదు.. ‘విద్వేష’ మెగా మాల్‌

రాహుల్‌పై నడ్డా ఫైర్‌

గోద్రా, జూలై 10: కాంగ్రెస్‌ అగ్ర నేత ప్రచార నినాదం ‘ప్రేమ దుకాణం (మొహ బ్బత్‌ కా దుకాణ్‌)’పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు. నిజానికి ఆయన ‘విద్వేష మెగా మాల్‌’ను నడుపుతున్నారని ఆరోపించారు. ఆయనతోపాటు కాంగ్రెస్‌ నేతలంతా ప్రధాని మోదీపై ద్వేషం వెదజల్లుతున్నారని ధ్వజమెత్తారు. మోదీ తొమ్మిదేళ్ల పాలనపై సోమవారం గుజరాత్‌లోని గోద్రాలో జరిగిన సభలో నడ్డా ప్రసంగించారు. ప్రతిపక్షాలకు ప్రజాసంక్షేమం పట్టదని.. అవి కుటుంబ పార్టీలుగా మారిపోతున్నాయని అన్నారు. ‘ప్రపంచ వేదికలపై మోదీకి ప్రశంసలు దక్కినప్పుడల్లా కాంగ్రెస్‌ వాళ్లు మనస్తాపానికి గురవుతారు. ఆయన్ను వ్యతిరేకించే ప్రయత్నంలో మన దేశాన్నే వ్యతిరేకిస్తున్నారు. రాహుల్‌గాంధీ బ్రిటన్‌ వెళ్లి.. భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్నారు. ఆయన నాయనమ్మ ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీని విధించారు. లక్షన్నర మందిని జైళ్లలో తోశారు. ఆయన ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌ నేతలు దిగజారుడు రాజకీయాలకు ఉపక్రమిస్తున్నారు. మోదీ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి నీచుడు, వృశ్చికం, విషనాగు, టీ కాచేవాడు అని అవహేళన చేస్తున్నారు. ఆయన 140 కోట్ల మందికి సేవ చేస్తుండం వారికి కంటగింపుగా మారింది.

ఆయనపై నిరంతరం ద్వేషం వెదజల్లుతూ ప్రేమ దుకాణాన్ని నడుపుతున్నామని ఎలా చెబుతారు’ అని నిలదీశారు. ప్రజాసేవలో ప్రధాని తీరిక లేకుండా ఉంటే.. విపక్షాలు సొంత కుటుంబాలను కాపాడుకోవడంలో నిమగ్నమై ఉన్నాయన్నారు. కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ, బీఆర్‌ఎస్‌, ఎన్‌సీపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీ, ఐఎన్‌ఎల్‌డీ, అకాలీదళ్‌ అధినేతలు తమ కుటుంబాలకే ప్రాధాన్యమిస్తారని.. నాయకత్వ బాధ్యతలను తమ వారసులకు మాత్రమే అప్పగిస్తారని ఆక్షేపించారు. కాంగ్రెస్‌ కుటుంబ పార్టీగా దిగజారిపోయిందని.. అందులో ముగ్గురు వ్యక్తులు.. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ మాత్రమే ఉన్నారని.. మిగతా నేతలంతా కాంట్రాక్టుపై పనిచేస్తున్నారని నడ్డా ఎద్దేవాచేశారు.

Updated Date - 2023-07-11T04:26:46+05:30 IST