Share News

CM of MP : మధ్యప్రదేశ్‌ సీఎంగా మోహన్‌ యాదవ్‌

ABN , First Publish Date - 2023-12-12T04:16:04+05:30 IST

అంచనాలను తలకిందులు చేస్తూ మధ్యప్రదేశ్‌లో అధికారాన్ని నిలబెట్టుకున్న బీజేపీ.. ముఖ్యమంత్రి ఎంపికలోనూ అంతే స్థాయిలో ఆశ్చర్యపరిచింది. తమకు కంచుకోటలాంటి రాష్ట్రంలో..

CM of MP : మధ్యప్రదేశ్‌ సీఎంగా మోహన్‌ యాదవ్‌

ఉజ్జయిని దక్షిణ ఎమ్మెల్యేను ఎంపిక చేసిన బీజేపీ..

ఉద్ధండులను కాదని ముఖ్యమంత్రిగా యాదవ్‌కు చాన్స్‌

రేపు ప్రమాణం.. ఛత్తీస్‌గఢ్‌ సీఎం కూడా

భోపాల్‌, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): అంచనాలను తలకిందులు చేస్తూ మధ్యప్రదేశ్‌లో అధికారాన్ని నిలబెట్టుకున్న బీజేపీ.. ముఖ్యమంత్రి ఎంపికలోనూ అంతే స్థాయిలో ఆశ్చర్యపరిచింది. తమకు కంచుకోటలాంటి రాష్ట్రంలో.. ఉద్ధండులైన నాయకులను కాదని, మోహన్‌యాదవ్‌ (58)ను సీఎంగా ప్రకటించింది. ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను పక్కనపెట్టింది. డిప్యూటీ సీఎంలుగా జగ్దీష్‌ దేవ్‌రా (మల్హాఘర్‌), రాజేశ్‌ శుక్లా (రేవా)లను ఎంపిక చేసింది. కేంద్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌కు అసెంబ్లీ స్పీకర్‌గా అవకాశం ఇచ్చింది. ఈ నెల 3న ఎన్నికల ఫలితాలు వెలువడగా.. మధ్యప్రదేశ్‌ సీఎం ఎవరనేదానిపై అనేక ఊహాగానాలు వచ్చాయి. వీటికి తెరదించుతూ సోమవారం బీజేపీ అధిష్ఠానం మోహన్‌యాదవ్‌కు పగ్గాలు అప్పగించింది. పొరుగు రాష్ట్రం ఛత్తీ్‌సగఢ్‌లో ఆదివాసీ నేత విష్ణుదేవ్‌ సాయ్‌ను సీఎంగా ప్రకటించిన కమలం పార్టీ.. మధ్యప్రదేశ్‌లో బీసీ యాదవ వర్గానికి చెందిన నాయకుడికి పట్టం కట్టింది. ఈ రాష్ట్రంలో యాదవులు ప్రభావవంతమైన సామాజికవర్గం కాకున్నప్పటికీ.. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ ఎంపిక చేసినట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు.

కాగా, సీఎం ఎవరో నిర్ణయించేందుకు బీజేపీ అధిష్ఠానం హరియాణ ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, ఓబీసీ సెల్‌ జాతీయ చైర్మన్‌, ఎంపీ డాక్టర్‌ కె.లక్ష్మణ్‌, జాతీయ కార్యదర్శి ఆశా లక్రాను పరిశీలకులుగా పంపింది. వీరు భోపాల్‌లో ఎమ్మెల్యేలు, శివరాజ్‌, తోమర్‌, ప్రహ్లాద్‌ పటేల్‌, కైలాష్‌ విజయవర్గీయ తదితరులతో సమావేశమయ్యారు. అనంతరం మోహన్‌ను బీజేపీ శాసనసభా పక్ష నేతగా ప్రకటించారు. సీఎంగా మోహన్‌ పేరును శివరాజ్‌ ప్రతిపాదించగా ప్రహ్లాద్‌, తోమర్‌, కైలాష్‌ సమర్థించారు. ఆ తర్వాత ఆపద్ధర్మ సీఎం శివరాజ్‌ పదవికి రాజీనామా చేశారు. మధ్యప్రదేశ్‌లో ఆయన శకం ముగిసినట్లేనని భావిస్తున్నారు. 2005 తర్వాత సీఎం ఎంపికకు పార్టీ పరిశీలకులను పంపడంతోనే శివరాజ్‌కు అవకాశం లేదని స్పష్టమైంది. మోహన్‌ బుధవారం ప్రమాణం చేయనున్నారు. అదే రోజు ఛత్తీస్‌గఢ్‌ సీఎంగా విష్ణుదేవ్‌ బాధ్యతలు స్వీకరిస్తారు.

మరోసారి బీసీకే చాన్స్‌

ఉమాభారతి, బాబూలాల్‌ గౌర్‌, శివరాజ్‌.. మధ్యప్రదేశ్‌లో 2003 నుంచి బీసీలనే సీఎం చేస్తున్న బీజేపీ.. ఈసారీ దానిని కొనసాగించింది. మోహన్‌యాదవ్‌ 1984 నుంచి బీజేపీలో ఉన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు అత్యంత విధేయుడు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉజ్జయిని దక్షిణ స్థానం నుంచి 2013 నుంచి గెలుస్తున్నారు. 2020లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చాక ఏర్పడిన బీజేపీ సర్కారులో ఉన్నత విద్యా మంత్రిగా వ్యవహరించారు. మంత్రిగా మూడేళ్ల అనుభవంతోనే సీఎం అయ్యారు. రాష్ట్రం దాటి ఈయన ఎవరికీ తెలియదు. అయినప్పటికీ శివరాజ్‌, తోమర్‌ వంటి సీనియర్లను కాదని మోహన్‌పై పార్టీ విశ్వాసం ఉంచింది.

Updated Date - 2023-12-12T04:16:12+05:30 IST