నేడు అయోధ్యకు మోదీ
ABN , Publish Date - Dec 30 , 2023 | 04:02 AM
సర్వాంగసుందరంగా ముస్తాబవుతున్న అయోధ్యను శనివారం ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించనున్నారు.
ఎయిర్పోర్టు, రైల్వేస్టేషన్ ప్రారంభం
రామజన్మభూమిలో భారీ స్వాగత ఏర్పాట్లు
పువ్వులు పరిచిన రహదారుల్లో రోడ్షో
సభా వేదిక వద్ద బంతి, చామంతులతో శ్రీరామ ఆకృతి
1400 మంది కళాకారులతో ప్రదర్శనలు
అయోధ్య, డిసెంబరు 29: సర్వాంగసుందరంగా ముస్తాబవుతున్న అయోధ్యను శనివారం ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించనున్నారు. నూతన విమానాశ్రయం, నవీకరించిన రైల్వేస్టేషన్ను ప్రధాని ప్రా రంభిస్తారు. రామజన్మభూమిలో అయోధ్య మందిరం ప్రారంభోత్సవం కోసం ఇప్పటికే శరవేగంగా పనులు జరుపుకొంటున్న ఈ నగరాన్ని ప్రధాని రాక సందర్భంగా మరింత సుందరంగా మలిచారు. భారీ స్వాగ త ఏర్పాట్లు చేశారు. కూడళ్లు, వీధులు, ప్రధాన ద్వారాలను పువ్వులతో అందంగా అలంకరించారు. రామాయణ ఘట్టాలను తెలిపే కుఢ్యచిత్రాలను గోడలపై చిత్రీకరించారు. ప్రధాని పర్యటన సాగించే ఎయిర్పోర్టు, రైల్వేస్టేషన్ మార్గాల్లో గులాబీలు పరిచాయి. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఈ మార్గాలను కొన్ని నెలలపాటు శ్రమించి అందంగా తీర్చారు. ప్రధాని శనివారం ఉదయం 10.45 గంటలకు అయోధ్యకు చేరుకుంటారు.
తొలుత రైల్వే స్టేషన్ను, అనంతరం ఎయిర్పోర్టును ప్రారంభిస్తారు. అక్కడ ఏర్పాటుచేసే బహిరంగ సభలో పాల్గొంటారు. సభా వేదిక వద్ద బంతి, చామంతులతో శ్రీరామ ఆకృతిని అందంగా తీర్చిదిద్దారు. మోదీని స్వాగతిస్తూ 1400 మంది కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్పోర్టు వరకు మోదీ రోడ్షోలో పాల్గొంటారని సమాచారం. ప్రధాని ప్రారంభించే రైల్వేస్టేషన్.. ఆధునికీకరణ తర్వాత అద్భుతమైన రూపం దాల్చింది. స్టేషన్ పై కప్పును శిఖరం ఆకృతిలో మలిచారు. శ్రీరాముని ధనస్సు, విల్లును అందంగా మలిచారు. గతంలో అయోధ్య జంక్షన్గా పిలిచిన ఈ స్టేషన్ను ఇప్పుడు అయోధ్యధామ్ జంక్షన్గా వ్యవహరిస్తున్నారు. అయోధ్య కొత్త విమానాశ్రయానికి ‘మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అయోధ్య ధామ్’ అని పేరు పెట్టారు.