Modi Channel No.1 : యూట్యూబ్లో మోదీ చానల్ నం.1
ABN , Publish Date - Dec 27 , 2023 | 05:25 AM
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫాం యూట్యూబ్లో ప్రధాని మోదీ సరికొత్త రికార్డు సాధించారు. నరేంద్ర మోదీ పేరుతో ఉన్న ఆయన చానల్ 2కోట్ల మంది సబ్స్క్రయిబర్ల
2 కోట్ల సబ్స్క్రయిబర్లు... 450 కోట్ల వ్యూస్
న్యూఢిల్లీ, డిసెంబరు 26: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫాం యూట్యూబ్లో ప్రధాని మోదీ సరికొత్త రికార్డు సాధించారు. నరేంద్ర మోదీ పేరుతో ఉన్న ఆయన చానల్ 2కోట్ల మంది సబ్స్క్రయిబర్ల మార్కును చేరుకుంది. ప్రపంచంలోనే ఈ రికార్డు సాధించిన తొలి రాజకీయ నేతగా మోదీ నిలిచారు. సబ్స్క్రయిబర్ల విషయంలోనే కాదు వీడియో వ్యూస్ విషయంలోనూ ఈ చానల్ రికార్డులు నెలకొల్పింది. ఈ చానల్లో పెట్టిన వీడియోలకు ఇప్పటి వరకూ 450 కోట్ల వ్యూస్ వచ్చాయి. ప్రపంచంలో ఇతర రాజకీయ నాయకులు ఈ విషయంలో మోదీ దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ తన చానల్కు 1.10 కోట్ల సబ్స్క్రయిబర్లతో మోదీ తర్వాతి స్థానంలో ఉన్నారు. కాగా, మాతృదేశ గౌరవం కోసమే జీవించాలన్నది సిక్కు గురువులు భారతీయులకు ఇచ్చిన సందేశమని మోదీ అన్నారు. మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన వీర్ బాల్ దివస్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. సిక్కుల గురువైన గురు గోబింద్సింగ్ ఇద్దరు కుమారులు జోరావర్ సింగ్, ఫతే సింగ్లను మెఘల్ పాలకులు ఉరితీయడాన్ని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశ ప్రజల్లో ఇప్పుడిప్పుడే బానిస మనస్తత్వం తొలగుతోందని, తమ సామర్థ్యాలు, వారసత్వంపై నమ్మకం పెరుగుతోందని మోదీ ఈ సందర్భంగా చెప్పారు. మన వారసత్వాన్ని మనమే గుర్తించకపోతే ప్రపంచం కూడా గౌరవించదన్నారు. రానున్న 25 ఏళ్లలో యువతకు అపారమైన అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. 2047నాటికి దేశం ఎలా ఉండాలన్నదాన్ని యువతే నిర్ణయించుకోవాలన్నారు.