Minister: కుర్చీ వేయడం ఆలస్యమైందని...
ABN , First Publish Date - 2023-01-25T07:39:51+05:30 IST
తనకు కుర్చీ వేయడంలో ఆలస్యమైందని ఆగ్రహించిన రాష్ట్ర పాడిపరిశ్రమల శాఖ మంత్రి నాజర్(Minister Nasser) ఓ వ్యక్తిపైకి రాయి విసిరారు.
- ఓ వ్యక్తిపైకి రాయి విసిరిన మంత్రి
చెన్నై, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): తనకు కుర్చీ వేయడంలో ఆలస్యమైందని ఆగ్రహించిన రాష్ట్ర పాడిపరిశ్రమల శాఖ మంత్రి నాజర్(Minister Nasser) ఓ వ్యక్తిపైకి రాయి విసిరారు. పాపం రాజకీయ ఒత్తిడో, మరొకటో గానీ విచక్షణ కోల్పోయిన ఆయన.. అసహనంతో వ్యవహరించారు. ఈ ఘటన మంగళవారం తిరువళ్లూరులో జరిగింది. ఇప్పుడీ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. బుధవారం తిరువళ్లూరులో జరుగనున్న భాషా సమరయోధుల సంస్మరణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) హాజరు కానున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను సమీక్షించేందుకు మంగళవారం మంత్రి నాజర్ అక్కడకు వచ్చారు. చాలాసేపు ఆయన అధికారులు, పార్టీ నేతలతో నిల్చొనే మాట్లాడారు. కొద్దిసేపటికి ఓ వ్యక్తి కుర్చీ తీసుకురావడాన్ని చూసిన మంత్రి సహనం కోల్పోయారు. నేలపై వున్న రాయి తీసుకుని అతడిపైకి విసిరారు. సీనియర్ నేత అయిన మంత్రి ఇలా సహనం కోల్పోవడం ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.