ఢిల్లీలో మేఘమథనం ?
ABN , First Publish Date - 2023-11-10T05:12:41+05:30 IST
దేశ రాజధాని న్యూఢిల్లీని వాయు కాలుష్యం గుప్పిట నుంచి విడిపించేందుకు అక్కడి సర్కారు మేఘ మథనానికి సిద్ధమవుతోంది.
న్యూఢిల్లీ, నవంబరు 9 : దేశ రాజధాని న్యూఢిల్లీని వాయు కాలుష్యం గుప్పిట నుంచి విడిపించేందుకు అక్కడి సర్కారు మేఘ మథనానికి సిద్ధమవుతోంది. క్లౌడ్ సీడింగ్ ప్రక్రియ ద్వారా కృతిమంగా వర్షాన్ని కురిపించి ప్రజలకు కాలుష్యం నుంచి విముక్తి కల్పించాలని భావిస్తోంది. క్లౌడ్సీడింగ్ ప్రక్రియలో భాగంగా మేఘాలలో కొన్ని లవణాల మిశ్రమాన్ని స్ర్పే చేసి వర్షం కురిసేలా చేస్తారు. గాలిలో ఉన్న ధూళి కణాలు వర్షం వల్ల భూమికి చేరి పర్యావరణం కాలుష్య రహితం అవుతుంది. ఈ ప్రక్రియ నిర్వహణకు ఐఐటీ కాన్పూర్కు చెందిన నిపుణులతో ఢిల్లీ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. ఈ నెల 20, 21 తేదీల్లో ఢిల్లీలో క్లౌడ్ సీడింగ్ చేపట్టాలని భావిస్తున్నారు. ఢిల్లీలో కాలుష్యానికి సంబంధించిన పలు పిటిషన్లు ఇప్పటికే సుప్రీంకోర్టు ముందున్న నేపథ్యంలో క్లౌడ్ సీడింగ్కు అత్యున్నత న్యాయస్థానం అనుమతి ఇవ్వాల్సి ఉంది.