Chennai: వాణీజయరామ్ మృతిపై పలు అనుమానాలు.. నేడు అంత్యక్రియలు..

ABN , First Publish Date - 2023-02-05T10:43:07+05:30 IST

ప్రముఖ సినీగాయని వాణీజయరామ్‌ (Vani Jayaram) మృతదేహానికి పోస్ట్‌మార్టం (Postmortem) పూర్తి అయింది. ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Chennai: వాణీజయరామ్ మృతిపై పలు అనుమానాలు.. నేడు అంత్యక్రియలు..

చెన్నై: ప్రముఖ సినీగాయని వాణీజయరామ్‌ (Vani Jayaram) మృతదేహానికి పోస్ట్‌మార్టం (Postmortem) పూర్తి అయింది. ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తలపై బలమైన గాయాలున్నట్టు గుర్తించిన పోలీసులు.. గాయాలపై ఇప్పటికిప్పుడే నిర్ధారణకు రాలేమన్నారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చాక క్లారిటీ వస్తుందన్నారు. కాగా ఆదివారం మధ్యాహ్నం చెన్నైలో వాణీజయరామ్‌ అంత్యక్రియలు జరగనున్నాయి.

ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరాం (Vani Jayaram Suspected Death) ఆమె నివాసంలో అనుమానాస్పద స్థితిలో విగత జీవిగా పడి ఉండటం భారతీయ చలనచిత్ర పరిశ్రమను షాక్‌కు గురిచేసింది. చెన్నైలోని నుంగంబాక్కమ్ (Nungambakkam) ప్రాంతంలోని డౌన్‌టౌన్ అపార్ట్‌మెంట్స్‌లోని (Downtown Apartments) ఫ్లాట్‌లో వాణీ జయరాం నివాసం ఉంటున్నారు. అదే ఇంట్లో శనివారం నాడు ఆమె చనిపోయినట్లు వార్తలు రావడంతో చెన్నై (Chennai) నగరం ఉలిక్కిపడింది. ఉదయమే ఆమె చనిపోయి ఉండొచ్చని, ఇంట్లో ఒక్కరే ఉండటంతో ఆమె చనిపోయిన విషయం ఆలస్యంగా బయటకు వచ్చిందని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆమె ఉంటున్న ఇంటిని పోలీసులు పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నారు. ఫోరెన్సిక్ టీం (Forensics team) కూడా వాణీ జయరాం ఇంటికి వెళ్లి ఆధారాలు సేకరించే పనిలో ఉంది. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌తోనే వాణీ జయరాం మృతికి కారణం ఏంటనే విషయంపై పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

వాణీ జయరాం ఇంట్లో పనిచేసే ఆమె పనిమనిషి మలర్‌కొడి శనివారం ఉదయం 10.30 గంటలకు వాణీ జయరాం ఇంటికి రోజూలానే వెళ్లింది. డోర్ కొట్టింది. ఐదు సార్లు కాలింగ్ బెల్ కొట్టినా వాణీ జయరాం తలుపు తీయలేదని చెప్పింది. తన భర్త కూడా వాణీ జయరాంకు కాల్ చేశాడని, అయినా ఆమె కాల్ లిఫ్ట్ చేయలేదని మీడియాకు వెల్లడించింది. వాణీ జయరాం ఒక్కరే ఆ ఇంట్లో ఉంటున్నారని ఆమె ఇంట్లో పనిచేస్తున్న మలర్‌కొడి తెలిపింది.

పనిమనిషి మలర్‌కొడి ఇంకా ఏం చెప్పిందంటే..

* వాణీజయరామ్‌ నుదురు, ముఖంపై గాయాలు ఉన్నాయి: పనిమనిషి

* పోలీసులకు సమాచారం ఇచ్చి.. ఆస్పత్రికి తరలించిన పనిమనిషి

* ఆస్పత్రికి తీసుకొచ్చే సమయానికి ప్రాణాలు కోల్పోయిందన్న వైద్యులు

* అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన చెన్నై పోలీసులు

* వాణీజయరామ్‌ ఇంటిని ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు

* సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలిస్తున్న చెన్నై పోలీసులు

కాగా సినీగాయని వాణిజయరామ్ మృతి చెందారన్న వార్త విజయనగరం జిల్లా సంగీత, వర్ధమాన గాయనీ గాయకులను దిగ్ర్భాంతికి గురిచేసింది. తెలుగు, తమిళం, ఇతర భాషాల్లో అనేక గీతాలను ఆలపించిన ఆమెకు జిల్లాతోనూ ప్రత్యేక అనుబంధం ఉంది. విజయనగరానికి 2005లో వచ్చినప్పుడు ఆత్రేయ పురస్కారాన్ని అందుకున్నారు. 2008లో మద్రాసు తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు అయోధ్యమైదానంలో జరిగిన సంగీత విభావరిలో పాల్గొన్న ఆమె అత్యంత ప్రజాధరణ పొందిన గీతాలను ఆలపించి శ్రోతలందరినీ కొన్ని గంటల పాటు కట్టి పడేశారు. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది.. ఆనతినీయరా! దొర... తెలిమంచు కురిసింది తలుపు తీయన ప్రభో.. తదితర పాటలకు సంగీత ప్రియులు జేజేలు పలికారు. వాణిజయరాం మృతి విషయం తెలిసి ఆమె అభిమానులు తల్లడిల్లిపోయారు.

Updated Date - 2023-02-05T10:43:11+05:30 IST