పక్కా స్కెచ్తోనే మనోరంజన్ దాడి?
ABN , Publish Date - Dec 14 , 2023 | 05:28 AM
లోక్సభలో దాడికి పాల్పడిన వ్యక్తులకు బీజేపీ మైసూరు ఎంపీ ప్రతాప్ సింహా కార్యాలయం నుంచి సందర్శకుల పాస్లు జారీ అయ్యాయి. దాడికి పక్కా ప్రణాళికతోనే సిద్ధమైనట్లు అధికారులు భావిస్తున్నారు. లోక్సభలో సందర్శకుల గ్యాలరీ నుంచి దూకిన డి.మనోరంజన్ మైసూరుకు
సందర్శక పాస్ కోసం 3 నెలలు తిరిగాడు!
బీజేపీ మైసూర్ ఎంపీ ఆఫీస్ నుంచి పాస్లు!
న్యూఢిల్లీ, డిసెంబరు 13: లోక్సభలో దాడికి పాల్పడిన వ్యక్తులకు బీజేపీ మైసూరు ఎంపీ ప్రతాప్ సింహా కార్యాలయం నుంచి సందర్శకుల పాస్లు జారీ అయ్యాయి. దాడికి పక్కా ప్రణాళికతోనే సిద్ధమైనట్లు అధికారులు భావిస్తున్నారు. లోక్సభలో సందర్శకుల గ్యాలరీ నుంచి దూకిన డి.మనోరంజన్ మైసూరుకు చెందిన వాడని, తరచూ ఎంపీ ఆఫీసుకు వస్తుండేవాడని అధికార వర్గాలు తెలిపాయి. విజిటర్స్ పాస్ కోసం మనోరంజన్ మూడు నెలలుగా ఎంపీ ఆఫీసును సంప్రదిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అతనితో పాటు సభలో బెంచ్లపై నుంచి దూకుతూ స్పీకర్ చాంబర్ వైపు దూసుకెళ్లిన సాగర్ శర్మను మనోరంజన్ తన స్నేహితుడని చెప్పి, పాస్ తీసుకున్నట్లు గుర్తించారు. కొత్త పార్లమెంటును చూడాలని ఉందంటూ ఎంపీ కార్యాలయ అధికారులకు చెప్పి, వీరు పాస్లు తీసుకున్నారు. బుధవారం సింహా తరఫున మొత్తం మూడు పాస్లు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. మరో మహిళకు పాస్ ఇచ్చినప్పటికీ.. ఆమె తన కుమార్తెతో కలిసి రావడం, చిన్నారి పేరు పాస్లో లేకపోవడంతో అనుమతించలేదని ఎంపీ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.