Mamata Banerjee: అది బీజేపీ ఎత్తుగడ, ఆ తప్పుని కేంద్ర హోంమంత్రి ఒప్పుకున్నారు.. మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు
ABN , Publish Date - Dec 17 , 2023 | 09:23 PM
పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఇదొక తీవ్రమైన విషయం అని, భారీ లోపం బయటపడిందని పేర్కొన్నారు. అలాగే.. ఈ కేసులో నిందితుల్లో ఒకరైన లలిత్ మోహన్ ఝాకు...
Mamata Banerjee On Parliament Security Breach: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఇదొక తీవ్రమైన విషయం అని, భారీ లోపం బయటపడిందని పేర్కొన్నారు. అలాగే.. ఈ కేసులో నిందితుల్లో ఒకరైన లలిత్ మోహన్ ఝాకు బెంగాల్ రాష్ట్రంతో సంబంధాలున్నాయని వచ్చిన వార్తలపై కూడా ఘాటుగా బదులిచ్చారు. ఇది బెంగాల్ను కించపరిచేందుకు బీజేపీ పన్నిన ఎత్తుగడ అని సంచలన ఆరోపణలు చేశారు.
‘‘పార్లమెంటు భద్రతా ఉల్లంఘన అనేది చాలా తీవ్రమైన విషయం. ఈ ఘటనతో భారీ భద్రతా లోపం బయటపడింది. ఇది పెద్ద తప్పు. దీనిని కేంద్ర హోంమంత్రి (అమిత్ షాని ఉద్దేశిస్తూ) ఇప్పటికే దీనిని అంగీకరించారు. ఈ ఘటనపై విచారణ చేయనివ్వండి’’ అని మమతా బెనర్జీ అన్నారు. ఇక ఈ కేసులో ప్రధాన కుట్రదారుడిగా భావిస్తున్న లలిత్ షాకి బెంగాల్తో సంబంధాలు ఉన్నాయనే వాదనలపై ఆమె స్పందిస్తూ.. ‘‘బెంగాల్ ప్రతిష్టను కించపరచడమే బీజేపీ పని. మా రాష్ట్రం అలాంటి చట్టవిరుద్ధమైన పనులకు ఏమాత్రం మద్దతు ఇవ్వదు’’ అని స్పష్టం చేశారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బెంగాల్ రాష్ట్రాన్ని మర్చిపోయిందని.. 100 రోజుల పథకం, ఆవాస్ యోజన, గ్రామీణ సడక్ యోజన వంటి బెంగాల్ బకాయిలను పంపిణీ చేయడం మానేశారని మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం కేంద్రం డబ్బు మాత్రమే కాదని.. రాష్ట్రం, కేంద్ర కలిసి ఆ పథకాల ఖర్చులకు వాటాలు పంచుకుంటాయని వివరించారు. అలాగే.. ఆరోగ్య కేంద్రాలకు కాషాయం పూయాలన్న కేంద్రం ఆదేశాన్ని ప్రస్తావిస్తూ.. ప్రజలు ఏం తినాలి? ఏం ధరించాలి? అనేది కూడా బీజేపీ నిర్ణయించాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
మెట్రో స్టేషన్లకు ఇప్పటికే కాషాయ రంగు పూశారని.. సిలిగురిలోని సుక్నాలో అన్ని ఇళ్లకు కాషాయం వేయడం చూసి తాను ఆశ్చర్యపోయానని మమతా బెనర్జీ అన్నారు. అసలు ‘ఆరోగ్యకేంద్రాలకు కాషాయం రంగు ఎందుకు పూయాలని ఆమె ప్రశ్నించారు. ఇప్పటికే వాటికి నీలం, తెలుపు రంగులు వేసుకున్నామని.. అది తమ పార్టీ రంగు కాదని, తమ రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్ అని వెల్లడించారు. ‘‘కాషాయం రంగుని, బీజేపీ లోగోని వేయాల్సిన అవసరం ఏముంది? ప్రజల్ని మభ్యపెట్టేందుకు ఇది పక్కా ప్రణాళికతో కూడిన కుట్ర’’ అని పేర్కొన్నారు.
ఆదివారం ఢిల్లీకి బయలుదేరిన మమతా బెనర్జీ.. అక్కడ సోమవారం ఎంపీలతో సమావేశం అవుతానని, ఇతర వ్యక్తులను కూడా కలుస్తానని స్పష్టం చేశారు. డిసెంబర్ 19వ తేదీన ఇండియా కూటమి మీటింగ్కు హాజరవుతానని.. డిసెంబర్ 20న ఉదయం 11 గంటల ప్రాంతంలో మోదీ తనకు అపాయింట్మెంట్ ఇచ్చారని అన్నారు. పశ్చిమ బెంగాల్కు బకాయి ఉన్న నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తానన్నారు. కొంతమంది ఎంపీలతో కలిసి అక్కడికి వెళ్తానని వెల్లడించారు.