The Kerala Story: ‘ద కేరళ స్టోరీ’ సినిమాను నిషేధించాలని ఒక జర్నలిస్ట్ మద్రాస్ హైకోర్టుకెళితే ఏమైందంటే..

ABN , First Publish Date - 2023-05-04T20:50:30+05:30 IST

‘ట్రైలర్‌’తోనే దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ‘ద కేరళ స్టోరీ’ సినిమాను నిషేధించాలని దాఖలైన ప్రజా హిత వ్యాజ్యాన్ని మద్రాసు హైకోర్టు కొట్టేసింది. కేరళ హైకోర్టులో కూడా ఈ తరహా పిటిషన్ దాఖలైందని..

The Kerala Story: ‘ద కేరళ స్టోరీ’ సినిమాను నిషేధించాలని ఒక జర్నలిస్ట్ మద్రాస్ హైకోర్టుకెళితే ఏమైందంటే..

‘ట్రైలర్‌’తోనే (The Kerala Story Trailer) దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ‘ద కేరళ స్టోరీ’ సినిమాను (The Kerala Story) నిషేధించాలని దాఖలైన ప్రజా హిత వ్యాజ్యాన్ని మద్రాసు హైకోర్టు కొట్టేసింది. కేరళ హైకోర్టులో కూడా ఈ తరహా పిటిషన్ దాఖలైందని జస్టిస్ ఏడీ జగదీష్ ఛండీరా, జస్టిస్ సి శరవణన్‌తో కూడిన ధర్మాసనం పిటిషనర్‌కు గుర్తుచేసింది. అంతేకాదు.. మే 5న సినిమా విడుదలవుతుంటే చివరి గంటలో పిటిషన్ దాఖలు చేయడం ఏంటని కోర్టు కొంత అసహనం వ్యక్తం చేసింది. అంతేకాకుండా.. సినిమా చూడకుండానే కోర్టు మెట్లెక్కడం ఏంటని ప్రశ్నించింది. ప్రస్తుతం ఈ అంశం కేరళ హైకోర్టు పరిధిలో ఉందని స్పష్టం చేసింది. బీఆర్ అరవిందాక్షన్ అనే చెన్నై నగరానికి (Chennai City) చెందిన జర్నలిస్ట్ ఈ ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ప్రాథమిక పరిశోధన కూడా చేయకుండానే దర్శకుడు ‘ద కేరళ స్టోరీ’ సినిమాను తెరకెక్కించాడని, దురుద్దేశంతో తెరకెక్కించిన ఈ సినిమాను మే 5న విడుదల చేయాలని నిర్ణయించారని.. సినిమా విడుదలపై నిషేధం విధించాలని పిటిషన్‌లో సదరు జర్నలిస్ట్ పేర్కొనడం గమనార్హం. ఈ సినిమా విడుదలైతే దేశంలో మత సామరస్యం దెబ్బతింటుందని పిటిషనర్ పేర్కొన్నారు.

FuxM6f_WIAAl-6j.jpg

ఇదిలా ఉండగా.. కేరళ రాష్ట్రంలో తప్పిపోయిన నలుగురు యువతులు మతం మార్చుకుని ఉగ్రవాదులుగా మారే ఇతివృత్తంతో రూపుదిద్దుకుని ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ‘ద కేరళ స్టోరీ’ చిత్రం విడుదలపై స్టే ఇవ్వడానికి సుప్రీం కోర్టు కూడా ఇప్పటికే నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విద్వేష పూరిత ప్రసంగాలు, సన్నివేశాలు ఉన్నాయనీ, అందుకే విడుదల కాకుండా స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటీషన్‌ను మంగళవారం కోర్టు తోసి పుచ్చింది. ఇప్పటికే ఈ చిత్రం సెన్సార్‌ పూర్తయిందనీ, ఈ సమస్యను హైకోర్టులోనే పరిష్కరించుకోవాలని జస్టిస్‌ జోసఫ్‌, జస్టిస్‌ నాగరత్న సూచించారు. ఈ శుక్రవారమే చిత్రం విడుదలవుతుండడంతో వ్యవధి లేనందున సుప్రీం కోర్టుకు వచ్చినట్లు పిటీషనర్ల తరఫున న్యాయవాదులు కపిల్‌ సిబాల్‌, నిజాం పాషా కోర్టుకు వెల్లడించారు. ఇది పద్ధతి కాదనీ, ఇలా అయితే ప్రతి ఒక్కరూ డైరెక్ట్‌గా సుప్రీం కోర్టుకు వస్తారని కూడా న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.

Fuz1FNiXoAAehHs.jpg

ఇదిలా ఉంటే ‘ద కేరళ స్టోరీ’ చిత్రంలో అభ్యంతరకరంగా ఉన్న పది సీన్లు తొలగించి, సినిమాకు ఏ సర్టిఫికెట్‌ ఇచ్చింది సెన్సార్‌ బోర్ట్‌. కేరళ మాజీ ముఖ్యమంత్రి వి.ఎస్‌.అచ్యుతానందన్‌తో చేసిన ఇంటర్వ్యు తొలగించిన సన్నివేశాల్లో ఒకటి. అలాగే హిందువుల దేవతల మీద చేసిన కొన్ని వ్యాఖ్యలు, కొన్ని షాట్స్‌ మనోభావాలను దెబ్బ తీస్తాయంటూ సెన్సార్‌ కత్తెర వేసింది. కేరళలో తప్పిపోయిన 32 వేల మంది యువతులు ఆ తర్వాత ఐసిస్‌లో చేరి ఉగ్రవాదులుగా మారినట్లు చెబుతూ ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌ వివాదానికి కారణమైంది.

Fuo04hJaIAEZnYn.jpg

అదా శర్మ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని సుదీప్తో సేన్‌ (Sudipto Sen) దర్శకత్వంలో విపుల్‌ అమృత్‌లాల్‌ షా నిర్మించారు. మొత్తం మీద.. న్యాయపరంగా అడ్డంకులేవీ లేకపోవడంతో ‘ద కేరళ స్టోరీ’ సినిమా మే 5న దేశ వ్యాప్తంగా విడుదల కానుంది. హైదరాబాద్‌లోని పలు మల్టీప్లెక్స్ థియేటర్లలో కూడా ఈ సినిమాకు టికెట్లను ‘బుక్ మై షో’ (Book My Show) అందుబాటులో ఉంచింది.

Updated Date - 2023-05-04T20:52:39+05:30 IST