Jagdish Shettar: కాంగ్రెస్లోకి జగదీశ్ శెట్టర్
ABN , First Publish Date - 2023-04-18T04:06:18+05:30 IST
కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత జగదీశ్ శెట్టర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
బెంగళూరు, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత జగదీశ్ శెట్టర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం బెంగళూరులోని కేపీసీసీ కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే ఆధ్వర్యంలో శెట్టర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీ పెద్దలు ఆయనకు హుబ్బళ్లి-ధారవాడ సెంట్రల్ టికెట్ ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన శెట్టర్ శనివారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. పార్టీ వీడకుండా బీజేపీ నేతలు చివరి క్షణం వరకు ప్రయత్నించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాక బెంగళూరుకు చేరుకోగా.. రాత్రంతా కాంగ్రెస్ నేతలు సుదీర్ఘ చర్చలు జరిపారు. సోమవారం బీజేపీ సభ్యత్వానికి రాజీనామా ప్రకటించి, ఆ వెంటనే కాంగ్రె్సలో చేరారు. అనంతరం శెట్టర్ మాట్లాడుతూ.. పార్టీలో అవమానం జరిగినందుకే బీజేపీని వీడానన్నారు. బీజేపీ తనకు అన్ని హోదాలు కల్పించిందనీ, ఇటీవల కొందరి చేతిలో పార్టీ నడుస్తోందనీ, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్షా వీటిని గుర్తించడం లేదన్నారు. కాంగ్రెస్ సభ్యత్వంతోపాటు బీ-ఫారంను శెట్టర్కు అందించారు. ఇదిలావుంటే, కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో ప్రధాని మోదీ మ్యాజిక్ నడవదని, పీకల్లోతు అవినీతిలో కూరుకున్న బీజేపీకి ప్రజలు గట్టి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్య విమర్శించారు. బీజేపీకి చెందిన లింగాయత అగ్రనేతలు జగదీశ్ శెట్టర్, లక్ష్మణ సవది చేరికతో ఉత్తర కర్ణాటకలో కాంగ్రెస్ మరింత బలోపేతం కానుందన్నారు. అంచనాకు మించి 150 సీట్లలో విజయం సాధిస్తామని సిద్దూ చెప్పారు. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్తో తనకు విభేదాలు లేవన్నారు. ఇదిలా ఉండగా, బీజేపీ నేత, సీఎం బసవరాజ్ బొమ్మై మైసూరులో మాట్లాడుతూ.. స్వార్థంతో పార్టీని వీడిన నేతల గురించి ఆలోచించవద్దని కార్యకర్తలకు సూచించారు. కాంగ్రె్సలోకి శెట్టర్ ఎందుకు చేరారో తెలియడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయన వెళ్లినా బీజేపీకి నష్టం లేదన్నారు.