Share News

త్రిపుర గవర్నర్‌గా ఇంద్రసేనా రెడ్డి

ABN , First Publish Date - 2023-10-19T04:45:53+05:30 IST

బీజేపీ సీనియర్‌ నేత నల్లు ఇంద్రసేనా రెడ్డి అనూహ్యంగా త్రిపుర రాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల

త్రిపుర గవర్నర్‌గా ఇంద్రసేనా రెడ్డి

ఒడిసా గవర్నర్‌గా ఝార్ఖండ్‌ మాజీ సీఎం రఘుబర్‌ దాస్‌

హైదరాబాద్‌/న్యూఢిల్లీ, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): బీజేపీ సీనియర్‌ నేత నల్లు ఇంద్రసేనా రెడ్డి అనూహ్యంగా త్రిపుర రాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తరుణంలో పార్టీలో కీలక బాధ్యతలను నిర్వహిస్తున్న ఆయనను గవర్నర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడడం విశేషం. ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి అండగా పార్టీపరంగా ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా (ప్రస్తుతం సూర్యాపేట జిలా)్ల తుంగతుర్తి నియోజకవర్గంలోని గానుగబండ గ్రామానికి చెందిన ఆయన తొలితరం బీజేపీ నేతల్లో ముఖ్యుడిగా ఎదిగారు. తొలుత ఏబీవీపీలో చేరి.. ఆ విభాగం ఉమ్మడి ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. అనంతరం బీజేవైఎం జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లారు. మొదటిసారి 1983లో మలక్‌పేట నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలుపొంది... అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ ఎన్నికల్లో అప్పటి హోం మంత్రి ప్రభాకర్‌ రెడ్డిని ఓడించారు. తర్వాత 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి.. సుమారు 17,791 ఓట్ల మెజారిటీతో మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు ఓడించారు. తిరిగి 1999లో జరిగిన ఎన్నికల్లో మూడోసారి గెలిచిన ఇంద్రసేనా రెడ్డి పార్టీ శాసనసభ పక్ష నేతగా వ్యవహరించారు. 2003 ఆగస్టులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పార్టీ అధ్యక్షుడిగా నియమితులై 2006 వరకు కొనసాగారు. 2007లో బీజేపీ జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఆయన పార్టీ జాతీయ కార్యవర్గంలో కొనసాగుతున్నారు.

తెలంగాణపై ప్రకటన ఇప్పించిన ఘనత ఆయనదే

తెలంగాణకు అనుకూలంగా బీజేపీ కీలక నిర్ణయం తీసుకోవడంలో ఇంద్రసేనా రెడ్డి ప్రధాన పాత్ర పోషించారు. 2005లో అప్పటి పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ పార్టీ కట్టుబడి ఉందని తొలిసారిగా ప్రకటన చేశారు. ఈ ప్రకటన వెనుక అప్పటి రాష్ట్ర పార్టీ అఽధ్యక్షుడిగా ఉన్న ఇంద్రసేనా రెడ్డిదే ప్రధాన భూమిక అని పార్టీ వర్గాలు తెలిపాయి. ముక్కుసూటి మనిషిగా, వివిధ కీలక అంశాలపై నిక్కచ్చిగా వ్యవహరించే నేతగా గుర్తింపు ఉన్న ఆయన.. పార్టీ తీసుకున్న కీలక నిర్ణయాల్లో తన వంతు పాత్ర పోషించారని వివరించాయి. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే నాయకుడిగా ముద్రవేసుకున్న ఆయనకు గతం లోనూ గవర్నర్‌ పదవి వరించే ప్రతిపాదన వచ్చి నా ఆయన సుముఖత వ్యక్తం చేయలేదని తెలిపాయి. ఈ నేపథ్యంలో పార్టీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న కీలక తరుణంలో ఆయన త్రిపుర గవర్నర్‌గా నియమితులు కావడం బీజేపీ శ్రేణులను ఆశ్చర్యానికి గురిచేసింది. కాగా, ఇప్పటికే తెలంగాణకు చెంది న బండారు దత్తాత్రేయ హరియాణా గవర్నర్‌గా ఉన్నారు.


ఒడిసా గవర్నర్‌గా రఘుబర్‌ దాస్‌

ఒడిశా గవర్నర్‌గా ఝార్ఖండ్‌ మాజీ సీఎం రఘుబర్‌ దా స్‌ నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. 2014 నుంచి 2019 వరకు సీఎంగా పనిచేశారు. ఇంద్రసేనా, దాస్‌ నియమకాలపై రాష్ట్రపతి కార్యాలయం బుధవారం రాత్రి ప్రకటన విడుదల చేసింది.

Updated Date - 2023-10-19T04:46:08+05:30 IST