చేయని నేరానికి జైలుశిక్ష.. ఎల్ఎల్బీ చదివి.. నిర్దోషిగా బయటకు!
ABN , First Publish Date - 2023-12-11T03:56:15+05:30 IST
చేయని నేరానికి 18 ఏళ్ల వయసులో జైలుపాలయ్యాడు! రెండేళ్ల కారాగారవాసం తర్వాత బెయిలుపై బయటికొచ్చి..
న్యూఢిల్లీ, డిసెంబరు 10: చేయని నేరానికి 18 ఏళ్ల వయసులో జైలుపాలయ్యాడు! రెండేళ్ల కారాగారవాసం తర్వాత బెయిలుపై బయటికొచ్చి.. న్యాయశాస్త్రంలో పట్టభద్రుడై, తన కేసు తానే వాదించుకుని నిర్దోషిగా బయటపడ్డాడు!! తనతోపాటు ఆ కేసులో అన్యాయంగా ఇరుక్కున్న మరో 13 మందిని బయటపడేశాడు. ఉత్తరప్రదేశ్కు చెందిన అమిత్ చౌదరి అనే వ్యక్తి కథ ఇది! యూపీలోని మేరఠ్ నగరంలో 12 సంవత్సరాల క్రితం.. క్రిషన్పాల్, అమిత్కుమార్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు హత్యకు గురయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆ కేసులో నిందితులను తక్షణం అరెస్టు చేయాలని నాటి యూపీ సీఎం మాయావతి పోలీసులను ఆదేశించారు. పోలీసులు హడావుడిగా 17 మందిని అరెస్టు చేశారు. వారిలో అమిత్ చౌదరి కూడా ఒకడు. రెండేళ్లపాటు జైల్లో ఉన్నాక అమిత్ 2013లో బెయిల్పై విడుదలయ్యాడు. బయటకు రాగానే న్యాయ విద్యలో చేరాడు. బీఏ ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం చదివాడు. బార్కౌన్సిల్ పరీక్షలో కూడా ఉత్తీర్ణుడయ్యాడు. తన కేసును తానే వాదించుకోవడం మొదలుపెట్టాడు. ఆ కేసులో దర్యాప్తు చేస్తున్న అధికారిని బోనులో నిలబెట్టి ప్రశ్నిస్తున్నప్పుడు అతడు తనను కనీసం గుర్తుపట్టలేకపోయాడని.. దీంతో, ఆ కేసులో తనను అన్యాయంగా ఇరికించారని న్యాయమూర్తికి అర్థమైందని అమిత్ పేర్కొన్నాడు. ఇటీవలే ఈ కేసులో కోర్టు తీర్పు ఇచ్చింది. అమిత్చౌదరితో పాటు మరో 13 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో.. సుమిత్కైల్, నీతూ, ధర్మేంద్ర అసలు దోషులుగా నిర్ధారించింది. అయితే వీరిలో సుమిత్ కైల్ 2013లో ఒక ఎన్కౌంటర్లో చనిపోయాడు. ధర్మేంద్ర క్యాన్సర్తో మరణించాడు. నీతూకు మాత్రం యావజ్జీవం, 20 వేల జరిమానా పడింది.