Satya Pal Malik: నాకేదైనా జరిగితే...?.. కశ్మీర్ మాజీ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-03-14T17:34:19+05:30 IST

కేంద్రం తనకు కల్పించిన భద్రతను తగ్గించినట్టు జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ..

Satya Pal Malik: నాకేదైనా జరిగితే...?.. కశ్మీర్ మాజీ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: కేంద్రం తనకు కల్పించిన భద్రతను తగ్గించినట్టు జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ (Satya Pal Malik) తెలిపారు. తనకు ఏదైనా జరిగితే కేంద్రానిదే బాధ్యతని సంచనల వ్యాఖ్యలు చేశారు. జడ్ ప్లస్ క్యాటగిరి స్థానంలో ఒక పర్సనల్ సెక్యూరిటీ అధికారిని (PSO)ను మాత్రమే తనకు కేటాయించారని తెలిపారు. రైతు సమస్యలు, కేంద్ర ప్రభుత్వ అగ్నివీర్ పథకంపై మాట్లాడినందుకే తనకు కల్పించిన భద్రతను కేంద్రం వెనక్కి తీసుకుందని 'ఇండియా టుడే'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఆరోపించారు.

జమ్మూకశ్మీర్, మేఘాలయ, గోవా గవర్నర్‌గా సత్యపాల్ మాలిక్ సేవలందించారు. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణను 2019లో రద్దు చేసి, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలగా విభజించిన సమయంలో సత్యపాల్ మాలిక్ జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా ఉన్నారు. కొద్ది నెలల తర్వాత గోవాకు 18వ గవర్నర్‌గా ఆయనను పంపారు. మేఘాలయ 21వ గవర్నర్‌గా 2022 అక్టోబర్ వరకూ ఆయన సేవలందించారు.

ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదు...

''నేను ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదు. ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలచుకున్నారు. నేను రాజకీయ నేతను కాను. కానీ నాకు ఏదైనా జరిగితే మాత్రం...దయజేసి ఢిల్లీకి రండి'' అని సత్యపాల్ మాలిక్ తన తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 2008 నుంచి 2018 వరకూ జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా ఉన్న ఎన్ఎన్ వోహ్రాకు ఇప్పటికీ భద్రత యధాతథంగా కొనసాగిస్తున్నారని చెప్పారు.

లేఖ రాసినా...

తనకు కల్పించిన భద్రతను తగ్గించడంపై హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాసినట్టు సత్యపాల్ మాలిక్ తెలిపారు. దీనిపై ఇంతవరకూ ఎలాంటి సమాధానం రాలేదని, భద్రతను తగ్గించడానికి కారణాలు చెప్పలేదని ఆయన వివరించారు. కాగా, ప్రోటాకాల్ ప్రకారం రాష్ట్రపతి, ప్రధాని కుటుంబ సభ్యులకు జీవితకాలం సెక్యూరిటీ కవర్ ఉంటుంది. అయితే గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ సెక్యూరీటీ మాత్రం భద్రతా సంస్థల నుంచి అందే ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం ఉంటుంది.

Updated Date - 2023-03-14T17:34:19+05:30 IST