Share News

కాల్చేసిన ఫోన్ల భాగాలు గుర్తింపు

ABN , Publish Date - Dec 18 , 2023 | 03:53 AM

పార్లమెంట్‌లో అలజడి రేపిన ఘటనలో లోతుగా విచారణ జరుపుతున్న పోలీసులు అన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. దాడికి సూత్రధారిగా భావిస్తున్న లలిత్‌ ఝా కీలక ఆధారాలను రాజస్థాన్‌లోని నాగౌర్‌లో ధ్వంసం చేసినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఈక్రమంలోనే

కాల్చేసిన ఫోన్ల భాగాలు గుర్తింపు

రాజస్థాన్‌ లోని నాగౌర్‌లో స్వాధీనం

పార్లమెంట్‌ ఘటనలో ఆధారాల సేకరణ

న్యూఢిల్లీ, డిసెంబరు 17: పార్లమెంట్‌లో అలజడి రేపిన ఘటనలో లోతుగా విచారణ జరుపుతున్న పోలీసులు అన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. దాడికి సూత్రధారిగా భావిస్తున్న లలిత్‌ ఝా కీలక ఆధారాలను రాజస్థాన్‌లోని నాగౌర్‌లో ధ్వంసం చేసినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఈక్రమంలోనే ఆదివారం అక్కడికెళ్లి కాల్చేసిన, ధ్వంసం చేసిన నిందితుల ఫోన్ల భాగాలను స్వాధీనం చేసుకున్నారు. దాడి ఘటన అనంతరం రాజస్థాన్‌కు పారిపోయి వచ్చిన లలిత్‌ ఝాకు స్నేహితుడు మహేశ్‌ కుమావత్‌ ఆశ్రయమిచ్చాడు. వీరిద్దరూ కలిసి నాగౌర్‌ జిల్లా త్రిశాంగ్య గ్రామంలోని ఓ హోటల్‌లో బస చేశారు. అక్కడే కొద్దిదూరంలో నలుగురు నిందితుల ఫోన్లు, ఇతర ఆధారాలు కాల్చేశారు. అనంతరం కుమావత్‌తో కలసి లలిత్‌ ఢిల్లీ పోలీసులకు లొంగిపోయాడు. సాంకేతిక ఆధారాలను ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసిన వీరిరువురిపై మరికొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

లలిత్‌ ప్లాన్‌ గురించి నాకేం తెలియదు..

పశ్చిమ బెంగాల్‌లోని లలిత్‌ స్నేహితుడు ఓ ఎన్జీవోకు చెందిన సౌరవ్‌ చక్రవర్తి మీడియాతో మాట్లాడారు. దాడి అనంతరం నిరసనను రికార్డు చేసిన లలిత్‌ ఝా సౌరవ్‌కు పంపి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేయమని కోరాడు. ఈక్రమంలోనే అతడిని పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే. ‘ఈ ఏడాది మే 14న ఫేస్‌బుక్‌లో లలిత్‌ పరిచయమయ్యాడు. అతడు పార్లమెంట్‌లో ఆందోళనకు ప్లాన్‌ చేస్తున్నాడన్న సంగతి నాకు తెలియదు. స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో సోషల్‌ మీడియాలో నా పోస్టులను లైక్‌ చేసేవాడు. కోల్‌కతాలో రెండు ర్యాలీల్లో కలిశాం’ అని సౌరవ్‌ వ్యాఖ్యానించారు.

Updated Date - Dec 18 , 2023 | 06:29 AM