High Court: 15వేల ఉపాధ్యాయుల తాత్కాలిక జాబితాకు బ్రేక్
ABN , First Publish Date - 2023-01-31T12:04:41+05:30 IST
ప్రాథమిక విద్యాశాఖ 15వేల మంది ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించి సిద్ధం చేసిన తాత్కాలిక జాబితాను నిలుపుదల
బెంగళూరు, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక విద్యాశాఖ 15వేల మంది ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించి సిద్ధం చేసిన తాత్కాలిక జాబితాను నిలుపుదల చేయాలని హైకోర్టు(High Court) ఆదేశించింది. ప్రవేశ పరీక్షల ద్వారా మార్కుల జాబితాకు అనుగుణంగా తాత్కాలికంగా జాబితాను విద్యాశాఖ ప్రకటించింది. సదరు జాబితాను కొనసాగించరాదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం నాగప్రసన్న నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం సోమవారం రద్దు చేసింది. కుల, ఆదాయపు సర్టిఫికెట్ల ఆధారంగా జాబితాను సిద్ధం చేశారని, ఇది నిబంధనలకు వ్యతిరేకమని న్యాయపరంగా జాబితాను కొనసాగించరాదని సీనియర్ న్యాయవాది శశికిరణ్శెట్టి వాదించారు. భర్త కులం, ఆదాయం సర్టిఫికెట్లను మాత్రమే పరిగణనలోకి తీసుకోకుండా తండ్రికి సంబంధించిన ఆధారాలను కూడా పరిగణించాలని ఆయన కోరారు. 15వేల మంది ఉపాధ్యాయుల నియామకాలకు హైకోర్టు సూచనతో బ్రేక్ పడినట్టయింది.