కశ్మీర్లో జీ20 పర్యాటక సదస్సు ప్రారంభం
ABN , First Publish Date - 2023-05-23T03:50:25+05:30 IST
భారీ భద్రత ఏర్పాట్ల నడుమ కశ్మీర్లో జీ20 దేశాల పర్యాటక సదస్సు ప్రారంభమైంది.
హాజరైన రామ్చరణ్.. కొరియా రాయబారితో నాటు నాటు స్టెప్
శ్రీనగర్, మే 22: భారీ భద్రత ఏర్పాట్ల నడుమ కశ్మీర్లో జీ20 దేశాల పర్యాటక సదస్సు ప్రారంభమైంది. చైనా మినహా అన్ని జీ20 దేశాలకు చెందిన ప్రతినిధులు ఇక్కడి ఎస్కేఐసీసీలో జరుగుతున్న ఈ మూడు రోజుల సమావేశానికి హాజరయ్యారు. వారందరికీ స్థానిక సంప్రదాయాలను అనుసరిస్తూ నృత్యకారులు, కళాకారులు ఘన స్వాగతం పలికారు. కశ్మీర్ లోయలో పర్యాటకానికి మరింత ప్రాచుర్యాన్ని తీసుకొచ్చేందుకు సినీ పర్యాటకం ఒక శక్తిమంతమైన సాధనమని కేంద్ర పర్యాటక మంత్రి జి కిషన్ రెడ్డి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ‘‘కశ్మీర్లో ప్రపంచ పర్యాటక పెట్టుటబడి శిఖరాగ్ర సదస్సును నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది’’ అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలుగు సినీ నటుడు రామ్ చరణ్ సైతం ఈ సమావేశానికి హాజరు కావడం విశేషం. కశ్మీర్కు రావడం తనకు చాలా సంతోషంగా ఉందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. భారత్లో కొరియా రాయబారి ఛంగ్ జే–బాక్తో కలిసి నాటు నాటు పాటకు చరణ్ నృత్యం చేయడం అందరినీ అలరించింది.